కామారెడ్డి జిల్లాలో ఏసీబీ అధికారుల విచారణ కొనసాగుతూనే ఉంది. ఐపీఎల్ బెట్టింగ్ విషయంలో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు కామారెడ్డి పట్టణ సిఐ జగదీష్ బెట్టింగ్ నిర్వహకుని వద్ద 5 లక్షల లంచం డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
బాధితుని ఫిర్యాదు మేరకు సిఐ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ పక్కా ఆధారాలు సేకరించి సిఐ జగదీష్ ను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. అయితే సిఐకి సంబంధించి ఏసీబీ అధికారులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ యాక్సిస్ బ్యాంకులో ఇందూర్ జగదీశ్ పేరిట ఉన్న లాకర్ ను ఏసిబి అధికారులు తెరిచారు.
అందులో ఉన్న 34 లక్షల 40 వేల 200 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే 9 లక్షల12 వేల 800 రూపాయల విలువ చేసే 182.560 గ్రాముల బంగారు ఆభరణాలు, 1020 రూపాయల విలువ చేసే 15.7 గ్రాముల వెండి ఆభరణాలు, పట్టాదారు పాసుపుస్తకాలు, ప్రాపర్టీ దస్తావేజులు స్వాధీనం చేసుకున్నారు.