కామారెడ్డి జిల్లా పోలీసు శాఖలో ఒక్కొక్కరుగా కనుమరుగవుతున్నారు. అవినీతి కేసుల్లో ఏసీబీకి చిక్కి జైలులో ఊచలు లెక్కపెడుతున్నారు. దాంతో ఉన్నతాధికారులు వారిపై సస్పెన్షన్ వేటు వేస్తున్నారు.
జిల్లా పోలీసు శాఖకు అవినీతి మరక అంటుకుంటోంది. ఇప్పటికే బాన్సువాడ రూరల్, కామారెడ్డి పట్టణ సిఐలు టాటాబాబు, జగదీష్ ఏసీబీ వలకు చిక్కారు. వీరితో పాటు కామారెడ్డి పట్టణ ఎస్సైపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దాంతో ఏసీబీ అధికారులు వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించగా పోలీసు శాఖ వీరిపై సస్పెన్షన్ వేటు వేసింది.
తాజాగా కామారెడ్డి డిఎస్పీ లక్ష్మీనారాయణపై అక్రమాస్తుల కేసుతో పాటు వివిధ రకాల గన్ లకు సంబంధించి 30 తూటాలు లభించడంతో ఏసీబీ అరెస్ట్ చేసి రిమాండుకు తరలించింది.
ప్రస్తుతం డిఎస్పీ లక్ష్మీనారాయణ జైలులో ఉన్నారు. అవినీతి ఆరోపణలపై అరెస్టైన డిఎస్పీ లక్ష్మీనారాయణను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
దాంతో జిల్లా పోలీసు శాఖలో మరో వికెట్ ఔట్ అయింది. ప్రస్తుతం జిల్లా పోలీసు శాఖలో గుబులు మొదలైంది. వరుస ఘటనలు ఎవరిపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని ఆందోళనకు గురవుతున్నారు.