దేశంలోని వివిఐపి లకు కరోనా భయం పుట్టించిన బాలివుడ్ సింగర్ కనికా కపూర్ కు మూడో వైద్య పరీక్షలో కూడా కరోనా పాజిటీవ్ వచ్చింది. విదేశాల నుంచి వచ్చి 14 రోజులు ఐసోలేషన్ లో ఉండకుండా బిజెపి ఎంపి దుష్యంత్ తో సహా పలువురు ప్రముఖులను కలవడమే కాకుండా అందరికి పార్టీ ఇచ్చిన కనికా కపూర్ విషయం ఇప్పటికే దేశంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
చదువుకున్న వారు సంస్కారం మరచి ఈ విధంగా కరోనా వ్యాధి వ్యాప్తి జరిగేలా చేయడం శోచనీయమని నెటిజన్లు పుంఖాను పుంఖాలుగా నిరసనలు వ్యక్తం చేశారు. కనికా కపూర్ కలిసిన దుష్యంత్ ఆ తర్వాత రాష్ట్రపతి రామ్ నాధ్ గోవింద్ ను కూడా కలిసినట్లు వార్తలు వచ్చాయి.
కనికా కపూర్ లక్నోలోని సంజయ్ గాంధీ పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చికిత్స పొందుతున్నారు. కనీసం రెండు టెస్టుల్లో నెగెటీవ్ వచ్చే వరకూ ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసేది లేదని ఆసుపత్రి డైరెక్టర్ ఆర్ కె దైమన్ తెలిపారు.