తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతుంది. తిరుపతి నగరం దినదినాభివృద్ధి చెందుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి సైతం వ్యాపార,ఉద్యోగ,చదువుల నిమిత్తం తిరుపతిలో స్థిరపడుతున్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోకి పంచాయతీలను విలీనం చేయడం జరిగింది.
భవిష్యత్తులో యాత్రికులకు నగర ప్రజలకు నీటి కష్టాలు రాకుండా వర్షాకాలంలో కపిలతీర్థం, మాల్వాడి గుండం నుంచి జాలువారే పవిత్ర జలాన్ని కపిలేశ్వర రిజర్వాయర్ పేరుతో మల్లెమడుగు రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచి నిల్వ ఉంచాలని దీనికి శ్రీవాణి ట్రస్టు నిధులు ఖర్చు చేసినా ఫర్వాలేదని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. తిరుమల కొండపై రద్దీ పెరిగినప్పుడు శ్రీవారి భక్తులను తిరుపతిలోనే వసతి ఏర్పాటు చేసుకోవాలని టిటిడి ప్రకటిస్తుంది టీటీడీకి సంబంధించిన శ్రీనివాసం,విష్ణు నివాసం,సత్రాలలో బస చేస్తారు అలాగే తిరుపతిలో లాడ్జిలు హోటల్స్ ప్రధాన రహదారులతోపాటు చిన్న వీధులలో కూడా విరివిగా పెరిగాయి తద్వారా తిరుపతి నగరంలో “నీటి వినియోగం” గణనీయంగా పెరిగింది.
తిరుపతిలో ప్రైవేట్ హోటల్స్ లాడ్జిలలో బస చేసే యాత్రికుల సౌకర్యార్థం యజమానులు వేసవిలో అలాగే కొన్ని సందర్భాలలో ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి సరఫరా చేస్తారు. టిటిడి ధర్మకర్తల మండలి, ఉన్నతాధికారులు,స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే,నగరపాలక సంస్థ,ఇరిగేషన్ అధికారుల సమన్వయంతో సమావేశమై “శ్రీవాణి ట్రస్టు” ద్వారా వచ్చే నిధులతో ఇప్పటికే ఇతర రాష్ట్రాలలో ఎన్నో దేవాలయాలు నిర్మిస్తున్నారు అలాగే తిరుమలకు వచ్చే భక్తులను తిరుపతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో నీటి సమస్య రాకుండా “కపిలేశ్వర రిజర్వాయర్” కు కొంత నిధులు కేటాయించాలని శ్రీవారి భక్తుల తరఫున స్థానిక ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన తెలిపారు.