కాపుల సంక్షేమంపై జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తున్నదని కాపు నాయకులు వ్యాఖ్యానించారు. విశాఖ పట్నంలో కాపు నేతలు కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి కాపు కులానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ రిటైర్డ్ అధికారులు, రాజకీయ నేతలు హాజరయ్యారు.
ఈ భేటీకి మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు, తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్, బోండా ఉమా, గంటా శ్రీనివాసరావు, మాజీ ఐఏఎస్ అధికారి భాను వచ్చారు. గత ప్రభుత్వంలో కాపుల కోసం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రస్తుతం అమలవుతున్న వాటిపై చర్చించారు.
కాపు రిజర్వేషన్లు, సంక్షేమాన్ని జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపుల రిజర్వేషన్లపై వైసీపీకి చెందిన కాపు నేతలు ఎవరూ మాట్లాడడం లేదని మండిపడ్డారు. కాపుల కోసం గతంలో రూ.3 వేల కోట్లు కేటాయించగా ప్రస్తుతం నిధుల కేటాయింపులు లేవని కాపు నేతల ఆవేదన వ్యక్తం చేశారు.
కాపు కులంతో పాటు రాష్ట్రం కూడా సర్వనాశనం అవుతుందని నేతల ఆవేదన వ్యక్తం చేశారు. ఫోరమ్ ఫర్ బెటర్ ఏపీ పేరుతో ఒక సంస్థను స్థాపించామని మాజీ డీజీపీ సాంబశివరావు తెలిపారు. బహుజన, కాపు సామాజిక వర్గాలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక స్వాతంత్రం కోసం ఫోరం ఫర్ బెటర్ ఏపీ పనిచేయబోతోందని ప్రకటించారు.
ఈ సంస్థ ఏపీలో ప్రజాసమస్యల పరిష్కారానికి పనిచేస్తుందని, భవిష్యత్లో రాజకీయ అజెండా తీసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. ఉత్తరాదిలో సామాజిక వర్గాల మధ్య జరిగిన కూర్పు లాంటి ప్రయోగంగా దీన్ని భావించ వచ్చునని సాంబశివరావు పేర్కొన్నారు.