కాపు రిజర్వేషన్ పేరుతో కాపు కులాన్ని రాజకీయ ప్రయోజనాల కు వాడుకుంటున్న ముద్రగడ పద్మనాభం నాయకత్వం తమకు అవసరం లేదని కాపు నాయకులు స్పష్టం చేశారు. రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు త్సవటపల్లి నాగభూషణం అధ్యక్షతన ఆదివారం కాయల సూరిబాబు స్వగృహంలో కాపు నాయకులు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి కాట్రేనికోన మండలం నుండే కాక పలు ప్రాంతాల నుండి కాపు నాయకులు హాజరయ్యారు.
ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన వెంట నడిచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని నష్టాలు అవమానాలు పడ్డామని కానీ ఉద్దేశపూర్వకంగా ఆయన చేస్తున్న పనులు కాపులను అవమానించేలా ఉన్నాయని నాగభూషణం పేర్కొన్నారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాపు ఉద్యమ సమయంలో ఆర్థికంగా, ఆహారపరంగా ఆదుకున్నారని అనడం సిగ్గుచేటు అన్నారు.
కాపులందరూ ఆ సమయంలో సొంత డబ్బులతో తుని సమావేశానికి హాజరై కేసుల్లో ఇరుక్కున్నారని పునరుద్గాటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఒక సినీ నటుడుగా చూస్తున్నానని ముద్రగడ పేర్కొనడం కాపులు పట్ల ఆయనకు ఎంత నిబద్ధతుందో అర్థమవుతుందన్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీలతో సంబంధం లేకుండా కాపు కులస్తులకు ఇబ్బందులు వస్తే ముందుంటున్నారని అదేవిధంగా జ్యోతుల నెహ్రూ కూడా కాపుల కోసం తాపత్రయం పడుతున్నారని భవిష్యత్తులో వీరు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు.
ముద్రగడ మొలతాడు కట్టిన వాడు మాట్లాడటం లేదని చెప్పడం ఎంతవరకు సబబు అని మేము మొలతాడు కట్టుకున్నాం కాబట్టే ముద్రగడను ముందుండి నడిపించామని ఆయన ఎద్దేవా చేశారు. లేఖాస్త్రాలు సంధించడం మానేసి ఇంట్లో కూర్చోవాలి లేదా ఇష్టమైన పార్టీలో తిరగాలి అంతే తప్ప తన స్వార్ధ ప్రయోజనాల కోసం కులాన్ని తాకట్టు పెడితే ఊరుకోమని ఈసారి అతని గ్రామాల్లో కూడా తిరగనివ్వబోమని నాగభూషణం హెచ్చరించారు.
జనసేన నాయకులు కాయల సూరిబాబు మాట్లాడుతూ ముద్రగడకు ఎంతో గౌరవించమని కూలీనాలి చేసుకునే కాపులు కూడా పనులు మానుకుని తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆయన వెంట సొంత ఖర్చులతో నడిచారని అన్నారు .రెడ్డి గారు ఉప్మా పెట్టారని నేడు ముద్రగడ ద్వారంపూడి వెనకేసుకు రావడం సిగ్గుచేటు అన్నారు పవన్ కళ్యాణ్ తన పర్యటనలో ఎక్కడా కూడా ముద్రగడను విమర్శించలేదని అయినా కూడా ఒక రెడ్డి గారికి ఈయన వత్తాసు పలకడం చూస్తుంటే రైలు దహనం ఈయన స్కెచ్ అని అర్థమవుతుందన్నారు.
ఉప్మా ఖర్చులకు గాను మనీ ఆర్డర్ డబ్బులు పంపించే కార్యక్రమం సోమవారం నుండి ప్రారంభిస్తున్నామన్నారు. జిల్లా సర్పంచులు సమాఖ్య కార్యదర్శి రాంబాల రమేష్ మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, పిల్లలు, వృద్దులు ముద్రగడను సోషల్ మీడియా వేదికగా చీ కొడుతున్నారని అన్నారు .అనంతరం ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం నుండి తప్పుకోవాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో ఆకాశం సత్యనారాయణ మూర్తి సలాది బాబ్జి నూకల దుర్గ బీమాల సూర్య నాయుడు చావటపల్లి మణికంఠ నూకల మూర్తి తాడి బాబా ఏడిది సతీష్ కంచు స్తంభం కిరణ్ కుమార్ కాయల బలరాం తదితరులు పాల్గొన్నారు.