ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి సతీమణి కాసు రాఘవమ్మ(97) కన్నుమూశారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ఆమె స్వగృహంలో రాఘవమ్మ తుదిశ్వాస విడిచారు. రాఘవమ్మ స్వస్థలం గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలోని చిరుమామిళ్ల గ్రామం.
రాఘవమ్మ మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ మంత్రి కాసు కృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. కాసు బ్రహ్మానంద రెడ్డికి రాజకీయంగానే కాకుండా కుటుంబ పరంగా రాఘవమ్మ చేదోడు వాదోడుగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. నరసరావుపేటలో పేద విద్యార్ధులకోసం కాలేజీని స్థాపించారని తెలిపారు.