కరోనా లాక్ డౌన్ ల కారణంగా ఒక్క నెలలోనే దేశంలో మొత్తం 11 లక్షల మంది స్థిరవేతనంతో ఉన్న వారు ఉద్యోగాలు కోల్పోయారు.
లేబర్ పార్టిసిపేషన్ రేట్ (ఎల్ పి ఆర్) ఫిబ్రవరి కన్నా మార్చి నెలలో పడిపోగా మార్చి తో పోలిస్తే ఏప్రిల్ లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.
దేశవ్యాప్త లాక్ డౌన్ విధించిన 2020 సంవత్సరం నెలవారీ లెక్కలతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్ లో రికార్డు స్థాయిలో ఎల్ పి ఆర్ పడిపోయింది.
గత ఏడాది తొలి సారిగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించగా ఈ ఏడాది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం లాక్ డౌన్ విధించుకుంది.
అయినా ఉద్యోగాలపై ఇంత ఎఫెక్ట్ కనిపించింది. ఎల్ పి ఆర్ శాతంలో ఎక్కువ వాటా ఉన్న మహారాష్ట్రలో ముందుగా లాక్ డౌన్ విధించడంతో ఆ ప్రభావం ఎక్కువ కనిపించింది.
దేశవ్యాప్తంగా స్థిర వేతనంతో ఉన్న ఉద్యోగాల సంఖ్య తగ్గిపోవడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. దేశ ఆర్ధిక వ్యవస్థ లో పెను మార్పులు చోటు చేసుకోవడం కారణంగా నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతున్నది.
స్థిర వేతనానికి ఉద్యోగం చేయాలనుకునేవారు ఎక్కువగా నష్టపోతున్నారు. ఇలా జరగడం దీర్ఘకాలిక నష్టం చేకూరుస్తుందని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్థిరవేతనంతో ఉన్న వారు రోజు వారీ కూలీల స్థాయికి వచ్చేస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే నిరుద్యోగుల శాతం మరింత వేగంగా పెరిగిపోతూ ఉంటుంది.
వ్యవసాయ కూలీలకు ఉపాధి లభ్యత కూడా గణనీయంగా తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఖరీఫ్ సీజన్ ముగియడం రబీ సీజన్ ఇంకా ప్రారంభం కాకపోవడం వల్ల వ్యవసాయ కూలీలకు ఉపాధి తగ్గిపోయింది.