ఆసరాలేని వారిని ఆదరించడమే కాకుండా అసువులుబాసిన తర్వాత అంతిమ సంస్కారాలు కూడా చేసిన సంస్కారులు వారు.
మతం ఏదో చూడకుండా మానవత్వమే తమ మతం అని చెప్పిన ఆదర్శ సేవకులు వారు. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం, ఉప్పరపల్లి గ్రామానికి చెందిన అనుమాండ్ల వీరస్వామి-శోభ భార్యభర్తలు. వీరికి పిల్లలు లేరు.
కూలి నాలి చేసుకుంటూ జీవనం సాగించే వారు. కనీసం వారికి ఉండటానికి ఇల్లు కూడా లేదు. వృద్ధుడైన భర్తను పోషించడానికి శోభ గ్రామంలోని పలు ఇళ్లల్లో ఇంటి పని చేస్తూ ఉండేది. చెట్టు కిందే జీవనం సాగిస్తున్న వారి దీన గాధ మీడియాలో రావడంతో రెండు సంవత్సరాల కిందట హన్మకొండ ప్రశాంత్ నగర్ లోని “సహృదయ అనాథ వృద్ధ ఆశ్రమ” నిర్వాహకురాలు యాకూబీ, చోటు వారికి ఆశ్రయం ఇచ్చారు.
అప్పటి నుంచి వారి ఆలనా పాలనా యాకూబీ, చోటు నే చూసుకుంటున్నారు. శుక్రవారం రోజున ఉదయం వీరస్వామి (8) గుండెపోటు తో మరణించాడు. ఏం చేయాలి? అతనికి వృద్ధురాలైన భార్య తప్ప ఎవరూ లేరు…. అంతే యాకూబీ అతనికి కొడుకుగా మారిపోయింది.
హిందూ సాంప్రదాయం ప్రకారం వీరస్వామి అంత్యక్రియలు నిర్వహించింది. చోటు ఆమెకు సహాయం అందించాడు. స్వయంగా యాకూబీ కుండ చేత పట్టి, చితికి నిప్పంటించి దహన సంస్కారాలు పూర్తి చేశారు…..
మతం గొప్పదా? మానవత్వం గొప్పదా???