కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నది. ఓటరు ఐడి కార్డును ఆధార్ తో అనుసంధానం చేసే ప్రక్రియను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీలన తర్వాత ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుంది.
దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో డబుల్ ఓటర్లు ఉన్నారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేవారి ఓట్లను తీసివేయడం కష్టంగా మారుతున్నది. చేరేవారు చేరుతున్నారు తప్ప ఓటర్ల జాబితా నుంచి ఓట్లు తీసేయడం లేదు. దానివల్ల ఎన్నికల అక్రమాలు జరుగుతున్నట్లు చాలా ఫిర్యాదులు వస్తున్నాయి.
వీటిని పరిష్కరించేందుకు ఆధార్ డేటాతో అనుసంధానం చేయడం ఒక్కటే మార్గమని భావిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రతిపాదనను చేసింది. అయితే ఆధార్ తప్పనిసరి చేయకూడదని 2015 లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తరువాత కొంత జాప్యం జరిగింది. ఆ సమయంలోనే ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలని కోరుతూ ఎన్నికల సంఘం కేంద్రాన్ని సంప్రదించింది.
సుప్రీంకోర్టు తీర్పు ఇప్పటికే అమల్లో ఉన్నందున చట్ట సవరణ అనివార్యం అయింది. అయితే దీనికి న్యాయపరమైన చిక్కులను తొలగించేందుకు న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 121.09 కోట్ల మంది పౌరులు ఉన్నారు. ఇప్పటి వరకు 123 కోట్ల మందికి ఆధార్ కార్డు జారీ చేశారు. మొత్తం ఆధార్ తీసుకున్న వారిలో 35 కోట్ల మంది 18 ఏళ్లలోపు వారు.
2019 లోక్సభ ఎన్నికల్లో 90 కోట్లకు పైగా ఓటర్లు పాల్గొన్నారు. చాలా మంది ఓటర్లకు ఆధార్ ఉందని కమిషన్ అంచనా వేసింది. అయితే అనధికారిక అంచనా ప్రకారం జనాభా 133 కోట్లకు చేరుకుంది. దీని ప్రకారం దేశంలో 10 కోట్ల మంది ప్రజలు ఆధార్ లేకుండానే ఉన్నారు. ఆధార్ ఎన్నికల జాబితాలతో అనుసంధానించేటప్పుడు ప్రభుత్వం ఎదుర్కొనే సవాలు ఇది.