హైదరాబాద్ లోని కూకట్ పల్లి ప్రాంతంలో ఉన్న భాగ్య నగర్ బస్ స్టాప్ వద్ద ఒక వ్యక్తి పోలీసులకు ఎందుకో అనుమానాస్పదుడుగా కనిపించాడు. దాంతో అతడిని ఆధీనంలోకి తీసుకుని విచారించడం మొదలు పెట్టారు. పోలీసుల అనుమానం నిజమైంది. అతడి వద్ద లిక్విడ్ గంజాయి దొరికింది.
నూతన సంవత్సరం సందర్భంగా వాహనాలు చెక్ చేస్తుండగా ఈ వ్యక్తి అనుమానాస్పదంగా అనిపించి ప్రశ్నించామని దాంతో గుట్టు రట్టయిందని కూకట్ పల్లి డిటెక్టీవ్ ఎస్ ఐ టంగుటూరి శ్రీనివాస్, ఎస్ ఓ టి సి మాదాపూర్ ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్సై విజయ్ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు పోలీసులకు దొరికిన ఇతడి పేరు వాసుపల్లి దినేష్ (26) విశాఖపట్నంలోని మధుసూదన్ నగర్ కు చెందిన ఇతను గంజాయి లిక్విడ్ ను తయారు చేసి తీసుకువచ్చి హైదరాబాద్ లో అమ్ముతాడట.
ఒక కిలో లిక్విడ్ ను అతడి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూకట్ పల్లి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ బి లక్ష్మీ నారాయణ రెడ్డి కేసు నమోదు చేసుకుని తదుపరి విచారణ ప్రారంభించారు.