చదువుతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని అందుకోసమే ప్రతి ఒక్కరూ చదువుకోవాలని రాష్ట్ర అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణ ప్రగతి లో భాగంగా నిర్మల్ ఆర్టీసీ బస్టాండ్ ను ఆయన సందర్శించారు. ప్రయాణ ప్రాంగణం లోని బైక్ స్టాండ్ వద్ద దీర్ఘకాలంగా ఉన్న చెత్తను, అక్కడ నిల్వ ఉన్న మురికి నీటిని తొలగించిన విధానాన్ని ఆయన పరిశీలించారు.
బస్టాండ్ సముదాయం లో ఉన్న దుకాణాలను సందర్శించి ప్రయాణ ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచాలని ప్లాస్టిక్ వాడకాన్ని ఆయన దుకాణ యజమానులకు అవగాహన కల్పించారు. బస్టాండ్ లో నిజామాబాద్ ప్లాట్ ఫామ్ వద్ద బస్సు కోసం నిరీక్షిస్తున్న సారంగాపూర్ మండలంకు చెందిన రేణుకను ఏ ఊరికి వెళ్తున్నారని బస్సు పై ఉన్న బోర్డును చదవడం వచ్చా అని అడిగితే రాదని ఆమె సమాధానం చెప్పగా కనీసం ఈ గ్రామానికి బస్సు వెళ్తుందో అనే బోర్డును చదవడం తెలుసుకోవాలని ఆయన అన్నారు.
చదువునే సమాజం అభివృద్ధి చెందుతుందని ప్రతి ఒక్కరూ కనీసం రాయడం, చదవడం నేర్చుకోవాలన్నారు. బస్టాండ్ లో ఉన్న హోటల్ లో పరిసరాలను పరిశీలించి కలెక్టర్ తో కలిసి టీ తాగారు. బస్టాండ్ గేటు వద్ద ఉన్న పండ్ల దుకాణాలను సందర్శించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఫుట్ పాత్ పై ఉన్న అమ్మకం దారులకు వేరే స్థలం కేటాయించనున్నట్లు తెలిపారు.
అనంతరం విశ్వనాథ్ పేట కాలనీ సందర్శించి మురికి నీటి కాలువల ను పరిశీలించారు. మురికి నీటి కాలువల ఉన్న బండలను తొలగించి కాలువను శుభ్రం చేయాలన్నారు. కాలనీలోని ఇళ్లకు వెళ్లి ప్రజలతో చెత్తను రోడ్లపై వేయకుండా రోడ్లు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. వైయస్సార్ కాలనీ సందర్శించి పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ, మునిసిపల్ చైర్పర్సన్ గండ్రత్ ఈశ్వర్, వైస్ చైర్మన్ షేక్ సాజిద్, ఎఫ్ ఎస్ సి ఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, డీ సంతోష్ కుమార్, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.