శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల పరిధిలో నిన్న ఒక కోవిడ్ అనుమానిత కేసు నమోదు అయిన నేపథ్యంలో పాతపట్నం మండల పరిధిలోని 27 నివాస ప్రాంతాలను బంద్ చేస్తున్నారు. నేటి నుంచి ఈ ప్రాంతాలలో అన్ని సేవలు బంద్ చేయనున్నట్లు ఆర్డిఓ టి వి ఎస్ జి కుమార్ తెలిపారు.
మెడికల్ షాపులు మినహాయించి మిగిలిన అన్ని నిత్యావసర సేవలు ఇళ్ల వద్దకే పంపిణీ చేస్తామని అన్నారు. పాతపట్నం మండలానికి ఆనుకొని ఉన్న హిరమండలం, సారవకోట, కొత్తూరు మండల పరిధిలోని గ్రామాలతో కలిపి 27 గ్రామాలు పూర్తిస్థాయి నిర్బంధం కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఇల్లు దాటి బయటకు వచ్చిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రతి గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. త్రాగు నీటిని సైతం ఇళ్ళ వద్దకే పంపిస్తామన్నారు. కూరగాయల దుకాణాలు, నిత్యావసర సరుకుల దుకాణాలను మూసివేయాలని, మొబైల్ వాహనాల ద్వారా ఇళ్ల వద్దకు వెళ్లి నిత్యవసర సరుకులు విక్రయించాలని ఆయన షాపు యజమానులకు సూచించారు.