సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ వారు సుమారు 60 వేల రూపాయలతో లారీ పార్కింగ్ యార్డ్ పరిసర ప్రాంతాలలో కోదాడ మిర్యాలగూడెం ప్రధాన రహదారులు కనపడే విధంగా ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను శుక్రవారం హుజూర్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాఘవరావు, సబ్ ఇన్స్పెక్టర్ అనిల్ రెడ్డి ప్రారంభించారు.
లారీ అసోసియేషన్ యార్డులో పార్కింగ్ చేసిన లారీల డీజిల్, విలువైన సామాగ్రి దొంగతనానికి గురి అవుతున్నాయి. దీనికి పరిష్కారంగా సబ్ ఇన్స్పెక్టర్ అనిల్ రెడ్డి సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వెంటనే లారీ అసోసియేషన్ కమిటీ నిర్ణయం తీసుకొని అత్యాధునిక కెమెరాలను ఏర్పాటు చేసిందని అధ్యక్షుడు కోతి సంపత్ రెడ్డి తెలిపారు.
పోలీసువారికి సహకరించి సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం అని సి ఐ రాఘవరావు అన్నారు. చెప్పిన వెంటనే సిసి కెమెరాలు ఏర్పాటు చేసిన లారీ అసోసియేషన్ కమిటీ సభ్యులకు సబ్ ఇన్స్పెక్టర్ అనిల్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
లారీ డ్రయివర్లు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, కరోనా వ్యాధి ప్రబలుతున్నందున దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మాస్కులు ధరించి, శానిటైజర్ వాడుతూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రారంభోత్సవం అనంతరం సిఐ రాఘవరావు ను, సబ్ ఇన్స్పెక్టర్ అనిల్ రెడ్డిని లారీ అసోసియేషన్ కమిటీ సభ్యులు సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో సెక్రెటరీ కేవీ ప్రతాప్, ట్రెజరర్ శ్రీనివాసరాజు, జాయింట్ సెక్రెటరీ రవి, గౌరవ సలహా కమిటీ సభ్యులు, లారీ యజమానుల సంఘ సభ్యులు పాల్గొన్నారు.