సామాజిక న్యాయం అందించడంలో సుప్రీంకోర్టు వెనుకబడి ఉందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ వ్యాఖ్యానించారు.
సామాజిక న్యాయం విషయంలో సుప్రీంకోర్టు తన మార్గాన్ని వీడినట్లే కనిపిస్తున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత స్వేచ్ఛ న్యాయవ్యవస్థ అనే అంశంపై ఢిల్లీలో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన సుప్రీంకోర్టు తీరుతెన్నులపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఆరేడు సంవత్సరాల కిందట తన హయాంలో సామాజిక న్యాయం కోసం ప్రత్యేకంగా ఒక బెంచిని ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఆ బెంచ్ లో మొదటి సారిగా సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ దాఖలు చేసిన సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్వాశితుల విషయాన్ని విచారించామని తగిన సామాజిక న్యాయం అందించామని ఆయన గుర్తు చేశారు.
ఆ తర్వాత సుప్రీంకోర్టు సామాజిక న్యాయం విషయంలో ఆశించినంతగా స్పందించలేదని ఆయన అన్నారు. కరోనా ఉపద్రవం వచ్చిన తర్వాత సామాజిక న్యాయం విషయం మరింతగా అవసరం ఏర్పడిందని ఆయన అన్నారు.
లక్షలాది మంది వలస కార్మికులు అనుభవించిన కష్టాలు సామాజిక న్యాయాన్ని కోరాయని మదన్ బి లోకూర్ అన్నారు. ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి నిరాశ్రయులయ్యారని ఆయన గుర్తు చేశారు.
సుప్రీంకోర్టు సామాజిక న్యాయం అందించడంలో వెనకడుగు వేసినట్లుగా తాను భావిస్తున్నానని మదన్ బి లోకూర్ అభిప్రాయపడ్డారు.