ఢిల్లీ ప్రభుత్వం మద్యం విధాన రూపకల్పనలో రూ.వంద కోట్లు చేతులు మారాయని ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు మాగుంట రాఘవ కీలక పాత్ర పోషించారని తెలిపారు. మాగుంట రాఘవను కోర్టులో హాజరుపరిచాక ఈడీ తన వాదనలు వినిపించింది. సౌత్గ్రూప్ పేరుతో వసూలు చేసిన సొమ్ము కీలక వ్యక్తుల ద్వారా పంపించారని ఈడీ వెల్లడించింది.
మాగుంట రాఘవకు మద్యం తయారీ, హోల్సేల్ వ్యాపారం ఉన్నాయి. మాగుంట రాఘవకు 2 రిటైల్ జోన్స్ కూడా ఉన్నాయని ఈడీ తెలిపింది. రూ.వంద కోట్ల ముడుపుల్లో రాఘవ కీలకంగా వ్యవహరించారు. ఈ కేసులో శరత్ రెడ్డి, విజయ్నాయర్, అభిషేక్, సమీర్, అమిత్ అరోరా, బినోయ్ ఇప్పటికే అరెస్టు అయ్యారు. రాఘవకు శరత్రెడ్దితో మంచి సంబంధాలు ఉన్నాయి. ముడుపుల సమీకరణలో సమీర్ మహేంద్రు కీలకంగా వ్యవహరించారని ఈడీ తెలిపింది.
ఇండో స్పిరిట్ కంపెనీలో రాఘవకూ భాగస్వామ్యం ఉంది. మద్యం విధానంతో లబ్ది పొందేందుకు ముడుపులు ఇచ్చారు. ముడుపులను హవాలా మార్గంలో చెల్లించారు. ఇప్పటికే దాఖలు చేసిన చార్జ్ షీట్లలో వివరాలు పొందుపరచామని ఈడీ తెలిపింది. ఇండో స్పిరిట్ కంపెనీ నుంచి రాఘవ మాగుంటకు వాటా వెళ్తోంది. రాబట్టాల్సిన ఆధారాలు, వివరాలు చాలా ఉన్నాయని అందుకోసం మాగుంట రాఘవను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది.