సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలం మట్టపల్లి మహా క్షేత్రంలోని శ్రీ లక్ష్మీనృసింహ వేద స్మార్త పాఠశాలలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేద పాఠశాల అధ్యాపకులు వేద ఘనాపాటి చీమలపాటి ఫణి శర్మ ఆధ్వర్యంలో మంగళవారం వేద, స్మార్త విద్యార్థులు పుట్టమన్నుతో సహస్ర లింగాలను సర్వాంగ సుందరంగా తయారు చేశారు.అనంతరం సహస్ర లింగాలకు అలంకారం చేసి,తొలుత గణపతి పూజ నిర్వహించి సహస్ర లింగాలకు ప్రాణప్రతిష్ఠ గావించి, మహాన్యాస పూర్వక రుద్ర,నమక,చమక పారాయణతో,పంచ సూక్త పారాయణ చేస్తూ పంచామృతాలతో,పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించి,షోడశోపచారాలు, శివ సహస్ర నామాలతో అర్చన గావించి, ధూపదీప,నైవేద్యములు,మహా నీరాజన మంత్ర పుష్పం సమర్పించి మహానివేదన గావించి,తీర్థప్రసాదాలు అందజేశారు.
ఎంతో భక్తిశ్రద్ధలతో వేద,స్మార్త విద్యలను అభ్యసిస్తున్న చిన్నారి విద్యార్థులు పఠిస్తున్న వేద మంత్రాలను ఆలకిస్తూ తమ్ము తాము మరిచి శివ నామ స్మరణలో వచ్చిన భక్తులు లీనమయ్యారు.శివ మహాలింగార్చన పూజాది కార్యక్రమాలు అయిన పిమ్మట వేద ఆశీర్వచనం చేశారు.
ఈ మహా లింగార్చన కార్యక్రమంలో వేద స్మార్త పాఠశాల సభ్యుడు బాచిమంచి చంద్రశేఖర్, శ్రీ లక్ష్మీనృసింహ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం నిర్వాహక కమిటీ ప్రధాన కార్యదర్శి చెన్నూరి మట్టపల్లిరావు, కోశాధికారి బాచిమంచి గిరిబాబు,సభ్యులు రంగరాజు వాసుదేవరావు,భువనగిరి శ్యామ్ సుందర్,పుల్లాభొట్ల శివ సుబ్రహ్మణ్యం, ధూళిపాళ రామకృష్ణ,పులిజాల శంకర్రావు,నారపరాజు పురుషోత్తమ రావు,సత్రం మేనేజర్ మధు,వేద,స్మార్త విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్