“మన బస్తీ- మన బడి” కార్యక్రమం అమలుపై తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి నేడు ప్రజాప్రతినిధులతో అవగాహన సమావేశం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఇంచార్జి DEO నీలం లింగం, MEO నాగేశ్వరరావు, బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని బాన్సువాడ గ్రామీణ, బీర్కూరు, నసరుల్లాబాద్ మండలాలతో పాటుగా బాన్సువాడ పురపాలక సంఘం పరిధిలోని ప్రజాప్రతినిధులు ఈ అవగాహన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్పీకర్ పోచారం మాట్లాడుతూ “మన ఊరు-మన బడి” ఒక మంచి కార్యక్రమమని తెలిపారు. పాఠశాలలో వసతులు మెరుగు పరచడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి దీన్ని ప్రారంభించారని ఆయన అన్నారు. కామారెడ్డి జిల్లా పరిధిలోని బాన్సువాడ నియోజకవర్గంలో 39 పాఠశాలలు మన “ఊరు-మన బడి”, “మన బస్తీ-మన బడి” కార్యక్రమం కింద ఎంపిక అయ్యాయని ఆయన తెలిపారు. ఈ పథకం ద్వారా వచ్చే నిధులతో పాఠశాలలో కనీస అవసరాలు తీర్చాలని ఆయన కోరారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్ధులలో మెజారిటీ పేద కుటుంబాలకు చెందిన వారు. వసతులు, సౌకర్యాలు కల్పిస్తే ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలు మెరుగవుతాయి. గ్రామాలలోని ప్రజాప్రతినిధులు, నాయకులు స్వయంగా నిలబడి పాఠశాలల నిర్మాణాలు వందేళ్లు ఉండేవిధంగా నాణ్యతతో పనులను చేయించాలి అని ఆయన అన్నారు. బాన్సువాడ నియోజకవర్గానికి SDF లో రూ.100 కోట్లు మంజురైతే రూ. 25 కోట్ల రూపాయలు పాఠశాలలకు కేటాయించామని ఆయన తెలిపారు.
జి.లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం