జీహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికల్లో 150 సీట్లకు గానూ టీఆర్ఎస్ 55, బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ రెండు సీట్లను సాధించిన విషయం విదితమే. మేయర్ ఎన్నికకు అవసరమైన పూర్తి మెజార్టీ మాత్రం ఏ పార్టీకి రాలేదు. దీంతో గెలిచిన కార్పొరేటర్లు సంతోషంలో ఉండగా, ఓడిన కార్పొరేటర్లు ఒకింత నిరాశకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓడిన కార్పొరేటర్ల పదవీకాలం ఇంకా ఫిబ్రవరి 20 వరకూ ఉండడంతో గెలిచిన కార్పొరేటర్లు కూడా తమకు పగ్గాలు ఇంకా అందడం లేదనే ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం టీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడలనే విమర్శలు వినిపిస్తున్నారు. ఏది ఏమైనా మేయర్ ఎన్నికపై టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఏం చేస్తారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఎంఐఎంతో జతకడతారా?
ఈ నేపథ్యంలో కొన్నిబలమైన వాదనలూ వినవస్తున్నాయి. ఎంఐఎంతో టీఆర్ఎస్ జతకడుతుందని కొందరు, మేయర్ పదవిని ఇరు పార్టీలు పంచుకుంటాయని మరికొందరు ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు వినూత్నమైన రీతిలో ఆలోచనలు వెలువడుతున్నప్పటికీ, అసలు గులాబీ బాస్ సీఎం కేసీఆర్ ఏ దిశగా ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటారో? అనేది చర్చనీయాంశం.
మేయర్ ఎన్నిక నోటిఫికేషన్ అనుమానమే?!
ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టపోయిన చందంగా గులాబీ పార్టీ విజయాన్ని అయితే సాధించగలిగింది గానీ దాంతో మేయర్కు కావాల్సిన బలం (98) తేలేకపోయింది. దుబ్బాక ఎన్నిక, ప్రాంతీయత, మతం, వరదలు, ఇలా అనేక రకాల కారణాలతో గులాబీ పార్టీకి ప్రజలు పెద్ద ఝలకే ఇచ్చారు. ఈ నేపథ్యంలో రానున్నకాలంలో ఎంఐఎం పార్టీతో కనుక జతకట్టి మేయర్ పదవిని చేపడతారనే ఆలోచనను సీఎం కేసీఆరే స్వయంగా సన్నిహితుల వద్ద తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే మరి సీఎం ఆలోచనలు ఏ దిశగా సాగుతున్నాయనేది సర్వత్రా చర్చనీయాంశమవుతుంది. కాగా మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేస్తారా? లేదా? అనేది కూడా అనుమానమేనని? అంటున్నారు.
మెజార్టీ లేక సందిగ్ధంగానే మేయర్ ఎన్నిక!
మేయర్ ఎన్నికలో రాజ్యసభ, లోక్సభ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉంటారు. గ్రేటర్లో 45 మంది ఎక్స్అఫీషియో సభ్యులు, 150 కార్పొరేటర్లతో కలిపి మొత్తం 195 మంది మేయర్ ఎన్నికలో ఓటర్లుగా ఉంటారు. వీరు మేయర్ను, డిప్యూటీ మేయర్ను ఎన్నుకుంటారు. ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎన్నిక నిర్వహిస్తారు. జీహెచ్ఎంసీ చట్టం మేరకు విధివిధానాలు ఇలా ఉంటాయి. దీనికి ముందుగా నోటిఫికేషన్ను విడుదల చేస్తారు. కాగా ఎవ్వరికీ (ఏ పార్టీకి) స్పష్టమైన మెజార్జీ లేకపోవడంతో మేయర్ ఎన్నిక సందిగ్ధంగా మారిందనే చెప్పుకోవచ్చు.
స్పెషలాఫీసర్ దిశగానే సీఎం కేసీఆర్ అడుగులు?
అయితే ఈసారి మేయర్ ఎన్నిక నోటిఫికేషన్ ఉండకపోవచ్చని, ప్రత్యేక అధికార పాలన (స్పెషలాఫీసర్) కొనసాగే దిశగానే సీఎం కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం ఊహించని విధంగా బీజేపీ పార్టీ బలాన్ని పుంజుకోవడంతో కేసీఆర్ కూడా తన ఆలోచనలకు పదునుపెట్టి ఎంఐఎంతో జతకడితే రానున్న ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే ఎన్నికల్లోనూ బీజేపీ హిందుత్వాన్ని ఏజెండాగా పనిచేస్తుందని దీంతో టీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూరే అవకాశం లేకపోలేదనే ఆలోచనతోనే ఎంఐఎం పార్టీతో జతకట్టేందుకు ససేమిరా అంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశాన్నింటినీ బేరీజు వేసుకుంటున్న గులాభీ అధినేత సీఎం కేసీఆర్ మేయర్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ ఎంఐఎంతో జతకట్టేందుకు సుముఖంగా లేనట్లు, అదే సమయంలో ప్రత్యేకాధికారి పాలన (స్పెషలాఫీసర్)వైపే మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
రానున్నఎన్నికల్లో ప్రజాతీర్పు ఎటువైపో?
ఏది ఏమైనా రానున్నఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తిరిగి తమ పట్టు నిలుపుకోనుందా? లేదా బీజేపీ సత్తా చాటుతుందా? అనేది ప్రజాతీర్పు ద్వారానే సుస్పష్టం కానుందనేది జగమెరిగిన సత్యం.