అన్నమయ్య జిల్లా రాజంపేట లో ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి పార్టీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పై ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తమ కుటుంబం పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
అబద్ధాలు చంద్రబాబు దిన చర్యగా మారిందని, ఇదీ ఆయనకు మంచిది కాదని హితవు పలికారు. రాజంపేట అన్నమయ్య డ్యామ్ కు ఊహించని విధంగా వరద నీరు రావడంతో మట్టికట్ట కొట్టుకు పోయిందని, అది తమ వల్ల జరిగిందని చంద్రబాబు నాయుడు తెలివిలేని మూర్ఖుడులా ఆరోపిస్తున్నారని అన్నారు. వరదల్లో 34 మంది చనిపోతే 62 మంది చనిపోయారని చెప్పడం అవాస్తవాలు చెబుతున్నారని అన్నారు.
చెయ్యేరు లో ఇసుక క్వారీ డ్యాంకు దిగువ ప్రాంతంలో 20 కిలోమీటర్ల దూరంలో ఉంటే డ్యామ్ ఎలా కొట్టుకు పోతుందని ప్రశ్నించారు. ఇసుక క్వారీ లతో తనకు సంబంధం ఉన్నట్టు చంద్ర బాబు నాయుడు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా, లేకుంటే చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తారా అని ఆయన ఛాలెంజ్ చేశారు. చంద్రబాబు నాయుడు ఇదే విధంగా ప్రవర్తిస్తే శ్రీలంక అధ్యక్షుడును ప్రజలు తరిమి కొట్టినట్టి తరిమి కొడతారని హెచ్చరించారు.