27.7 C
Hyderabad
April 26, 2024 06: 56 AM
Slider జాతీయం సంపాదకీయం

డప్పు కొట్టే మీడియాతో అధికార పార్టీకే నష్టం

exit poll

మీడియా మొత్తం మోడీ మాయ నుంచి బయటపడలేకపోయింది. అందుకే మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలలో బిజెపికి దారుణమైన దెబ్బ తగలబోతున్నదని పసిగట్టలేకపోయింది. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలు ఈ రెండు రాష్ట్రాలలో బిజెపికి ఎదురేలేదని తేల్చి చెప్పాయి. అంతే కాదు ఎగ్జిట్ పోల్స్ పేరుతో ఈ మీడియా సంస్థలు చేసిన హంగామా అంతా తప్పని తేలిపోయింది.

అన్ని ప్రముఖ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ శుద్ధ అబద్ధమని తేలిపోయాయి. ఎగ్జిట్ పోల్స్ ఊహించినట్లు బిజెపి అప్రతిహత విజయం సాధించలేదు. మహారాష్ట్రలో అయితే ఏడుగురు మంత్రులే ఓడిపోయారు. హర్యానాలో బిజెపి చావు తప్పి కన్ను లొట్టపోయింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మొదలైన నాటి నుంచి బిజెపి బిజెపి బిజెపి అంటూ ఊదరగొట్టాయి. అంతే కాదు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ, ఎన్ సి పి ల కార్యకర్తలు తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యే విధంగా వార్తలు రాశాయి, ప్రసారం చేశాయి.

ఎన్ సి పి అధినేత శరద్ పవర్ పై కేసులు, ఆ పార్టీ మరో నాయకుడు ప్రఫుల్ పటేల్ కు దావూద్ ఇబ్రహిం కంపెనీలతో సంబంధాలు అంటూ వచ్చిన కేసులపై చిలవలు పలవలు చేసి రాశాయి. కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేడని తేల్చి చెప్పేశాయి. నాయకుడు లేని పార్టీకి ఓట్లు ఎవరు వేస్తారని ఏక పక్షంగా బిజెపికి రాసేశాయి. ఒక రకంగా చెప్పాలంటే బిజెపిని ఎదిరించి రాసింది ఒక్క సామ్నా పత్రికే. బిజెపి చేస్తున్న పనులను పరోక్షంగా ఒకటి రెండు సందర్భాలలో శివసేన అధికార పత్రిక అయిన సామ్నా ప్రశ్నించింది.

ఎలక్ట్రానిక్ మీడియా అయితే మోడీ బాకా సంస్థలు అయిపోయి వాస్తవాన్ని మరుగున పెట్టేశాయి. దేశంలోని ఏ మీడియా సంస్థకూ వాస్తవ పరిస్థితి తెలియలేదు. రాయలేదు. ప్రసారం చేయలేదు. అంతా ఏక పక్షమే. ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత బిజెపిలో ఉత్సాహం తొంగి చూసింది కానీ ఫలితాలు భిన్నంగా ఉన్నాయి. అధికారంలోకి రావడం రాకపోవడం అటుంచి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదు.

పైగా గతంలో కన్నా మెరుగైన ఫలితాలు సాధించింది. ఈ ఎన్నికల ఫలితాల నుంచి మీడియా నేర్చుకోవాల్సి చాలా ఉంది. మీడియా ఏక పక్షంగా మారిపోతే అధికార పార్టీలకే నష్టం అనేది మరొక మారు నిరూపణ అయింది. కేవలం ఒకే పక్షం వైపు, అదీ కూడా అధికార పక్షం వైపు రాస్తూ పోతే మీడియా విశ్వసనీయత కోల్పోతుంది. అంతే కాదు ఇలా రాయించుకున్న ఏ అధికార పక్షానికి కూడా తాత్కాలిక ఆనందమే తప్ప శాశ్వత అధికారం దఖలు పడలేదు. మీడియాపై అధికార పక్షాల నియంత్రణ లేకుండా ఉంటే వాస్తవాలు ఎప్పటికప్పుడు బయటకు వచ్చి తప్పులు సరిదిద్దుకునే అవకాశం అధికారంలో ఉన్న పార్టీలకు ఉంటుంది. మీడియా వాస్తవాలు రాస్తే క్రెడిబిలిటీ వస్తుంది.

Related posts

14న తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం

Satyam NEWS

మిగులు యూనిట్లు  వెంటనే గ్రౌండింగ్ కావాలి

Murali Krishna

మహానుభావులను గుర్తు చేసుకున్న సిక్కోలు వాసులు

Satyam NEWS

Leave a Comment