వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానానికనుగుణంగా రెగ్యులర్ చేయాలని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు)ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ జఫరుల్లా డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం టి.శ్రీ లక్ష్మీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జఫరుల్లా మాట్లాడుతూ ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్టు ఉద్యోగులందరికీ చేస్తానని వాగ్దానం చేసి ఇప్పుడు కొద్ది మందిని మాత్రమే చేస్తానని చెప్పడం తగదన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మొత్తం కాంట్రాక్టు ఉద్యోగులపై ఆధారపడి పనిచేస్తుందని, ఎంతో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు డిఎన్వీడి ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో అవినీతి విలయతాండవం చేస్తోందని ఆరోపించారు. ప్రతి పనికి జిల్లా డిఎంహెచ్ఓ కార్యాలయంలో డబ్బులు వసూలు చేయడం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని వైద్య ఆరోగ్యశాఖ లో జరుగుతున్న అవకతవకలపై స్పందించాలని కోరారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా నాయకులు డి. వేణుగోపాలచారి, ఏం. బాలరాజు,ఏ.సులోచన, ఏ.సునీల్, సుభాషిని తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన డి. వేణుగోపాలచారికి అభినందనలు
యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన డి వేణుగోపాల చారిని సమావేశంలో అభినందించారు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలపై కృషి చేస్తానని ఆయన తెలిపారు.