వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక గర్భిణి మరణించింది. తమ కుమార్తె మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ ఆ గర్భిణి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. వివరాలలోకి వెళితే మేడ్చల్ జిల్లా చిన్నకిష్టపూర్ కు చెందిన సాయి రాజు భార్య కోటగిరి అనిత( 22 ) మొదటి కాన్పు కోసం తల్లిగారింటికి వచ్చింది.
అనిత తల్లిదండ్రులు వర్గల్ మండలం జబ్బాపూర్ లో ఉంటారు. కాన్పు కోసం కుమార్తెను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి కి తీసుకువెళ్లారు. నొప్పులు వస్తున్నాయని కాన్పు కోసం నిన్న ఉదయం 10 గంటలకు ఆస్పత్రి తీసుకువెళ్లారు. రాత్రి 11:00 గంటల వరకు ఆమెకు కాన్పు జరగలేదు.
దాంతో ఆపరేషన్ చేశారు. అయితే ఆపరేషన్ సమయంలో రక్తస్రావం అదుపు చేయడం డాక్టర్లకు సాధ్యం కాలేదు. రక్త పరీక్ష కూడా వారు ముందు చేయకపోవడంతో అదనపు రక్తం ఎక్కించేందుకు వీలుకాలేదు. రక్త పరీక్ష చేయకుండా ఆపరేషన్ ఏ విధంగా ప్రారంభించారో వైద్యులకే తెలియాలి. రక్తం అధికంగా పోవడంతో కోటగిరి అనిత అపస్మారక స్థితికి చేరుకుంది.
పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించడంతో వైద్యం కోసం హైదరాబాద్ కు తరలిస్తుండగానే అనిత మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. వైద్య పరీక్షలు సరిగా నిర్వహించకుండానే ఆపరేషన్ చేయడం వల్లే ఆమె మృతి చెందిందని బంధువులు ఆసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న గజ్వేల్ పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించి అనిత మృతదేహానికి పోస్టుమార్టం కోసం సిద్దిపేట జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు.