వారం రోజుల నుంచీ ఏపీ ప్రభుత్వం… రోడ్ ప్రమాదాల నివారణకై భద్రత పరమైన జాగ్రత్తలు తెలుపుతూ చైతన్య ఉత్సవాలు నిర్విస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా విజయనగరం జిల్లా పోలీసు బాస్…ఎస్పీ దీపికా.. నిర్వహిస్తున్న రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా విజయనగరం రూరల్ పోలీసు స్టేషను పరిధిలో ఆటోలు నడుపుతున్న డ్రైవర్లకు పుష్పగిరి కంటి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించినట్లుగా రూరల్ సీఐ టి.వి.
తిరుపతిరావు తెలిపారు. విజయనగరం రూరల్ పోలీసు స్టేషను పరిధిలో వివిధ గ్రామాల్లో నివసిస్తూ, ఆటోలు నడుపుతు జీవిస్తున్న డ్రైవర్లును గుర్తించి, వారికి పుష్పగిరి కంటి ఆసుపత్రిలో చికిత్సలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ టి.వి.తిరుపతిరావు మాట్లాడుతూ రహదారి ప్రమాదాల నియంత్రణలో డ్రైవర్లకు దృష్టి లోపం లేకుండా ఉండడం చాలా అవసరమన్నారు. చాలామంది డ్రైవర్లు తమ కండ్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కారణంగా, ప్రాధమిక స్థాయిలో వైద్యం పొంది, దృష్టి లోపాలను సరి చేసుకోని కారణంగా శాశ్వతంగా దృష్టి కోల్పోతున్నారన్నారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా రూరల్ ఎస్ఐ గణేష్ ఆధ్వర్యంలో సిబ్బంది వివిధ గ్రామాల్లో నివసిస్తూ, ఆటోలను నడపడమే వృత్తిగా ఎంచుకొని జీవిస్తున్న వారిని గుర్తించి, పుష్పగిరి కంటి వైద్యుల సహకారంతో వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని ఆటో డ్రైవర్లు సద్వినియోగం చేసుకొని, కండ్లకు పరీక్షలు చేసుకొని,
వైద్యులు సూచనలు, సలహాలు, చికిత్సతో దృష్టి లోపాలు లేకుండా చూసుకోవాలని సీఐ టివి తిరుపతిరావు కోరారు.
వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ముందుకు వచ్చిన పుష్పగిరి కంటి ఆసుపత్రి యాజమాన్యంకు, వైద్యులకు ఆయన
కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో విజయనగరం రూరల్ ఎస్ఐ గణేష్ మాట్లాడుతూ వాహనాలకు తప్పనిసరిగా ఇన్సూరెన్సు, సి-బుక్, డ్రైవింగు లైసెన్సు, పొల్యూషన్ దృవ పత్రాలు ఉన్నట్లే, డ్రైవర్లు సురక్షితంగా వాహనాలు
నడిపేందుకు తగిన సామర్థ్యం, ఆరోగ్యం కలిగి ఉండాలన్నారు. ఇందులో భాగంగా డ్రైవర్ల దృష్టి లోపాలను గుర్తించి, ప్రాధమిక స్థాయిలో వైద్యం అందించేందుకు పుష్పగిరి కంటి ఆసుపత్రి వైద్యుల సహకారంతో డ్రైవర్లుకు నేత్ర పరీక్షలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో పుష్పగిరి కంటి ఆసుపత్రి డా. రాజేశ్వరరావు, సురేష్, ఇతర పోలీసు అధికారులు, వంద మంది డ్రైవర్లు పాల్గొన్నారు.