తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేయబోతున్న మెగా రక్తదాన శిబిరాన్ని నేడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పరిశీలించారు. ఈ నెల 24న కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆయన రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కరోనా లాక్ డౌన్ కారణంగా అన్న ప్రముఖ రక్త నిధి కేంద్రాలలో రక్తం నిల్వలు తగ్గిపోయాయి.
ఎంతో మంది పేదలు ఆసుపత్రిలో చేరితే వారికి రక్తం అవసరమైనప్పుడు లభ్యం కావడం లేదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని గత రెండు నెలుగా వివిధ దఫాలుగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఇప్పుడు కేటీఆర్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ఈ నెల 24న ఈ మెగా శిబిరం ఉంటుందని ఆయన చెప్పారు. రక్తం దానం చేసేందుకు వచ్చే వారికి శానిటైజర్, మాస్క్ కచ్చితంగా ఉండేలా చూస్తామని, భౌతిక దూరం పాటిస్తూ రక్తదానం చేసే విధంగా ఏర్పాట్లు చేశామని గోపీనాథ్ తెలిపారు. రక్తం దానం చేసే వారికి పేద ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆయన అన్నారు.
అదే సమయంలో వారికి ఒక గిఫ్ట్ ప్యాక్ తో బాటు సర్టిఫికెట్ కూడా అందచేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రక్తదాన శిబిరం కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తారు. సీనియర్ వైద్యులు ఈ రక్తదాన శిబిరాన్ని పర్యవేక్షిస్తారు.