జగన్ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను తిడుతూ ఆయన అన్న మెగాస్టార్ చిరంజీవిని పొగుడుతూ డ్రామాలు ఆడటం వైసీపీ నేతలకు ఇంత కాలం అలవాటుగా మారింది. దానికి తోడు చిరంజీవి చేసే వ్యాఖ్యలు కూడా జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండటంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తీవ్రమైన వత్తిడికి లోనయ్యేవారు. ఒక దశలో అన్నా తమ్ముడి మధ్య విభేదాలు ఉన్నాయా అనేంత స్థాయిలో పుకార్లు వ్యాపించాయి.
ఇటీవలి కాలంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో జగన్ ప్రభుత్వాన్ని తూర్పార పడుతున్నారు. వాలంటీర్ల వ్యవస్థ తో సహా అన్ని అవినీతి కార్యక్రమాలపై ఆయన ధ్వజమెత్తుతున్నారు. అయితే చిరంజీవి ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు. తొలిసారిగా మెగాస్టార్ చిరంజీవి జగన్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వాల్తేరు వీరయ్య 200 రోజుల ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి ఈ కీలక వ్యాఖ్యలు చేయడం పవన్ కల్యాణ్ అభిమానుల్లో జోష్ నింపింది.
ఏపీ ప్రభుత్వ తీరుపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా పాలకులు సినీ పరిశ్రమపై పడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టండి. ప్రజలకు సంక్షేమ పథకాలు, ఉద్యోగ, ఉపాధిపై దృష్టి పెట్టండి. ఉద్యోగ, ఉపాధిపై దృష్టి పెట్టినప్పుడే ప్రజలు మెచ్చుకుంటారు అంతే కానీ ఇలాంటి పనులు చేయవద్దు అంటూ ఆయన జగన్ ప్రభుత్వానికి హితవు చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలందిస్తే అంతా తలవంచి నమస్కరిస్తారు అంటూ మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు చేశారు.