హవాలా ద్వారా వేల కోట్ల రూపాయలు తరలించిన వైనంపై సమగ్ర విచారణ జరపాలని గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. నేడు నరసరావుపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చెన్నైలో నివాసమున్న వైయస్ భారతి బంధువు సుధాకర్ రెడ్డి కి చేర్చేందుకు డబ్బు తరలిస్తున్నరన్న ఆరోపణలపై లోతైన విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
రూ.5.27 కోట్లు పట్టుబడిన ఈ కేసును ఈడికి అప్పజెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పట్టుబడిన వారు మంత్రి అనుచరులేనని ఒంగోలులో అందరికి తెలుసునని అరవిందబాబు అన్నారు. పారిపోయిన మంత్రి తనయుడిని వెంటనే పట్టుకోవాలని, మంత్రి కుమారుడు ప్రణీత్ రెడ్డికి అతని సన్నిహితంగా ఉండే ముఖ్య అనుచరుడు నల్లమల్లి బాలు పట్టుబడ్డ విషయం వాస్తవం కాదా? అని అరవిందబాబు ప్రశ్నించారు.
మంత్రికి చెందిన ఒక్క వాహనాన్ని పట్టుకుంటేనే 5 కోట్లు దొరికాయి. ఈ విధంగా ఎన్ని సార్లు తరలించారో. పోలీసులకు పట్టుబడిన కారు మంత్రి బాలినేని కు చెందిన స్టికర్ ఉంది. అదేవిధంగా ఈ కారును ఎక్కడ ఆపడానికి వీల్లేదని గతంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు చెప్పారని అరవిందబాబు అన్నారు.
నల్లమల్లి బాలు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, అతని కుమారుడు ప్రణీత్ రెడ్డి లకు ముఖ్య అనుచరుడని ఆయన అన్నారు. అతను ఇతర రాష్ట్రాల నుండి దొంగ బంగారం ని తీసుకొచ్చి షాపుల్లో సరఫరా చేస్తుంటాడని అరవిందబాబు తెలిపారు.
ఇతను వైసీపీ పార్టీ నుండి ఒంగోలు నగరం వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడని, స్థానిక సంస్థల ఎన్నికలకు ఒంగోలు కార్పొరేషన్ లోని 25వ డివిజన్ నుండి వైసిపి కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి ప్రస్తుతం పోటీలో ఉన్నారని చదలవాడ అరవింద బాబు అన్నారు.