వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్క సారిగా తమను తామే కుక్కలుకా, పందులుగా పోల్చుకోవడం జుగుప్స కలిగిస్తున్నది. విశ్వాసంలో మేం కుక్కలతో పోటీ పడతాం అంటూ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. పార్టీకి విధేయులుగా ఉంటామని చెప్పవచ్చు కానీ ఆయన ఎందుకో తమను తాము కుక్కలతో పోల్చుకున్నారు.
అదే విధంగా తనపై మూకుమ్మడిగా దాడి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు పందుల్లాంటి వారని తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు చెప్పారు. సింహం తనలాగా సింగిల్ గా వస్తుందని, మంత్రులు, ఎమ్మెల్యేలు పందుల్లా మూకుమ్మడిగా తనపై దాడి చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని బట్టబయలు చేసిన ఎంపి రఘురామకృష్ణంరాజు పై మంత్రులు నేడు మూకుమ్మడి విమర్శల దాడి చేశారు.
కేవలం రెడ్లకు మాత్రమే పదవులు ఇస్తున్నారని నిన్న వ్యాఖ్యానించిన ఎంపి రఘురామకృష్ణంరాజు అంతకు ముందు ఇళ్ల స్థలాల విషయంలో వైసీపీ నాయకులు ఏ విధంగా దోచుకుంటున్నారో చెప్పారు. అదే విధంగా నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు మాట్లాడుతూ జగన్ బొమ్మ పెట్టుకుని గెలిసిన ఎంపి రఘురామకృష్ణంరాజు ఆయననే విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు.
తానేమీ జగన్ బొమ్మ పెట్టుకుని గెలవలేదని, తన పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలు తన బొమ్మ పెట్టుకుని గెలిచారని ఎంపి రఘురామకృష్ణంరాజు అన్నారు. జగన్ బొమ్మ పెట్టుకుని గెలిచిన వారు జగన్ కు విధేయులుగా ఉండాలని ఎమ్మెల్యే ప్రసాదరాజు అనడంతో దానికి మంత్రులు కూడా గొంతు కలిపారు.
దానికి సమాధానంగా ‘‘నాపై కామెంట్లు చేసిన అయిదుగురు నా బొమ్మ పెట్టుకుని నెగ్గారు.. మీరంతా రాజీనామా చేసి, జగన్ బొమ్మ మీద పోటీ చేయండి.. నేను రాజీనామా చేసి, నా బొమ్మ మీద పోటీ చేస్తాను. ఎవరు గెలుస్తారో చూద్దాం. మీరు రాజీనామా చేస్తేనే నేను రాజీనామా చేస్తా మీరు రాజీనామా చేయండి, నేను రాజీనామా చేస్తాను.. ఎవరి బొమ్మకు ఎంత విలువుందో తేల్చుకుందాం అని ఎంపి రఘురామకృష్ణంరాజు సవాల్ చేశారు.
మంత్రి పేర్ని నాని చీటికి మాటికి టీవిల్లో కనిపించే అందగాడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒక హై లెవెల్ లో ఉన్నవారితో తప్ప, వీళ్ళతో నేను ఎప్పుడూ మాట్లాడలేదు యూజ్ లెస్ ఫెలోస్, బి కేర్ పుల్, ఒళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడండి అని ఆయన అన్నారు. టీ కప్పులో తుపాను లా ముగిసి పోతుందని అనుకున్న ఈ రగడ ఇంత పెద్దది కావడం అధికార వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడని వ్యవహారమే. అంతే కాకుండా ఇది ఇంతటితో పోయేలా కనిపించడం లేదు.