ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన కిరాతకుడికి కఠిన శిక్ష విధించాలని సభ్య సమాజం మొత్తం కోరుకుంటున్నది. కొందరైతే వాడ్ని పట్టుకుని బహిరంగంగా ఉరిశిక్ష వేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో నే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చైత్ర సంఘటనపై చాలా మంది చాలా రకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు.
గతంలో దిశ సంఘటనలో నిందితులు ఆ తర్వాత ఎన్ కౌంటర్ అయ్యారు. అదే విషయం అందరి మదిలో ఉన్నది. తాజాగా మంత్రి మల్లారెడ్డి చైత్ర సంఘటనపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. చైత్ర సంఘటనలోని వాడ్ని ఎన్ కౌంటర్ చేసి చంపేస్తామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు.
దిశ ఎన్ కౌంటర్ లో నిందితులు పారిపోతుంటే పోలీసులు కాల్పులు జరిపారు. మరి మంత్రి మాత్రం చైత్ర హంతకుడిని నేరుగా ఎన్ కౌంటర్ చేసి చంపేస్తామని అంటున్నారు. చైత్ర సంఘటనలోని వాడికి కఠిన శిక్ష పడాలని అందరూ కోరుకుంటున్నారు కానీ మంత్రిగా ఉండి ఇలా వ్యాఖ్యలు చేయవచ్చా అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయింది.