ఆదర్శగ్రామం జొన్నవలసలో విజయనగరం జిల్లా కలెక్టర్ పర్యటన
ప్రతీ ఒక్కరూ చదువుకోవాలని…అలాగ ప్రతీ మహిళా పని చేయాలని ఏపీలోని విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి కోరారు. ఈ మేరకు విజయనగరం మండలంలోని ఆదర్శగ్రామమైన జొన్న వలసలో పర్యటించిన కలె్క్టర్ సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో, గ్రామ అభివృద్దిపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జెడ్పిటిసి కెల్ల శ్రీనివాసరావు, సర్పంచ్ కె.రమాదేవి, ఇతర అధికారులతో మాట్లాడి, గ్రామం అవసరాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాకు సిమ్మెంటు సరఫరా మొదలయ్యిందని, వెంటనే పనులను మొదలు పెట్టాలని సూచించారు. బిల్లులు కూడా వెంటవెంటనే వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ భవనాన్ని పూర్తిచేసి, డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయాలని సూచించారు. చుట్టుప్రక్కల నాలుగైదు గ్రామాలకు కలిపి వేస్ట్వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు ఏర్పాటు చేయడానికి సుమారు నాలుగు ఎకరాల స్థలాన్ని సేకరించాలని సూచించారు.
అలాగే గ్రామంలో అవసరమైతే సామూహిక మరుగుదొడ్డిని నిర్మించుకోవాలని, దానికి నిధులను మంజూరు చేస్తామని చెప్పారు. గ్రామంలో బల్క్మిల్క్ కూలింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని, దానికి అవసరమైన సుమారు 10 సెంట్ల స్థలాన్ని గుర్తించాలని సూచించారు.
అవసరమైనవారు గోశాలలు నిర్మించుకోవాలని కోరారు. ఇక బాలురతో సమానంగా, బాలికలను కూడా చదివించాలని, కన్నవారిని కలెక్టర్ కోరారు. బడి ఈడు పిల్లలంతా తప్పనిసరిగా బడికి వెళ్లేలా చూడాలని . ఎట్టిపరిస్థితిలోనూ చదువు మానవద్దని, చదువుకున్నవారికి ఉపాధిని కల్పించేందుకు నైపుణ్య శిక్షణను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతీమహిళా సమయాన్ని వృథా చేయకుండా, కష్టపడాలని, ఏదో ఒక పనిచేయాలని సూచించారు.
ప్రతీ శుక్రవారం శానిటేషన్, దోమల నివారణపై దృష్టి పెట్టాలని… గ్రామంలో చెరువులను అభివృద్ది చేయడంతోపాటుగా, గంబూషియా చేపలను వేయడం ద్వారా దోమలను నివారించవచ్చని కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో మండల ప్రత్యేకాధికారి అరుణకుమారి, డీపీఓ సుభాషిణి, తహశీల్దార్ బంగార్రాజు, ఎంపిడిఓ సత్యనారాయణ, ఏఓ ఎం.ఉమామహేశ్వరనాయుడు, సిడిపిఓ శ్రీదేవి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.