విశాఖ ఉక్కు ఉద్యమానికి ఊతమిచ్చేందుకు విశాఖ ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు…ఇది పాత వార్త. ఆయన చేసింది డమ్మీ రాజీనామా అని విమర్శలు చెలరేగడంతో మళ్లీ తన రాజీనామాను సవరించి స్పీకర్ ఫార్మాట్ లో పంపుతున్నట్లు గంటా శ్రీనివాసరావు మళ్లీ చెప్పారు…..
ఇన్ని మళ్లీ మళ్లీలు జరిగినా స్పీకర్ తమ్మినేని సీతారాం మాత్రం గంటా రాజీనామాను ఆమోదించడం లేదు. ఈ లోపు విశాఖపట్నం పై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న రాజ్యసభ సభ్యుడు, వైసీపీలో అత్యంత కీలక నేత, ప్రముఖుడు అయిన విజయసాయిరెడ్డి… ఇటీవల గంటా పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
ఇలా గంట అరగంట రాజీనామాలతో విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ ఆగదని, విశాఖ ఉక్కును ఆపాలంటే అది ఒక్క తమకే సాధ్యమౌతుందని చెప్పేశారు… తెలుగుదేశం పార్టీలో గెలిచిన గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు అత్యంత తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. జగన్ ఒప్పుకున్నారు కానీ మంత్రి అవంతి శ్రీనివాస్, విజయసాయి రెడ్డి ఒప్పుకోవడం లేదని ఆ మధ్య చాలా మంది చెప్పుకున్నారు.
గంటా రాజీనామా త్యాగాన్ని విజయసాయి రెడ్డి అపహాస్యం చేయడంతో అది కన్ఫమ్ అయిందని కూడా అనుకుంటున్నారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నదంటే…. గంటా శ్రీనివాసరావు హుటాహుటిన వెళ్లి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ను కలిశారు.
ఎందుకు కలిశారు????? అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయింది. తన రాజీనామాను ఆమోదించమని కోరినట్లు గంటా శ్రీనివాసరావు పబ్లిక్ లో చెబుతున్నారు కానీ… లోపల జరిగింది ఏమిటి? అనేది ప్రశ్న. వైసీపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ రాకపోవడం, తెలుగు తమ్ముళ్లు దూరంగా పెట్టడం… మునిసిపల్ ఎన్నికల్లో ప్రచారం చేసినా నమ్మకపోవడం… లాంటి అనిశ్చిత రాజకీయ భవిష్యత్తుతో ఇప్పుడు ఎమ్మెల్యే సీటుకు తాను చేసిన రాజీనామాను స్పీకర్ ఆమోదించేస్తే గంటకు ఫుల్ స్టాప్ పడుతుంది.
అందుకే ‘‘ అన్నా కొంచెం వెనుకా ముందు చూసి నిర్ణయం తీసుకోండి’’ అని గంటా అసెంబ్లీ స్పీకర్ ను కోరారట. ‘‘అన్నీ ఆలోచించి చేస్తాలే’’ అని స్పీకర్ హామీ ఇచ్చారట. రాజీనామా ఆమోదిస్తే విశాఖ ఉక్కు ఉద్యమం గంటా శ్రీనివాసరావు చేతులోకి వెళుతుందేమో అని విజయసాయిరెడ్డి మునిసిపల్ ఎన్నికల ముందు ఆందోళన చెందారట.
అయితే ఇప్పుడు ఆ ఆందోళన తీరిపోవడంతో రాజీనామా ఆమోదించినా ఫర్వాలేదు… అని వైసీపీ నిర్ణయం తీసుకున్నదట. ఈ అనిశ్చిత స్థితిలో ఉన్న పదవి కూడా పోతే ఎలా???? అందుకే ఈ హడావుడి రాజకీయం అని చర్చించుకుంటున్నారు.