కోవిడ్-19 వాక్సినేషన్ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా అమలవుతోంది. మిగిలిన దేశాలతో పోల్చితే ఇండియాలో వాక్సినేషన్ ప్రక్రియ తక్కువస్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. వాక్సినేషన్ ప్రారంభమైన మొదటిరోజు నుంచి 50 వ రోజువరకు సగటున 100 మందికి ఇచ్చిన డోసుల రేటు గమనిస్తే… ఇండియా 1.7 డోసులు మాత్రమే ఇచ్చినట్లు తేలింది.
అమెరికా 50వ రోజునాటికి సగటున 9.8 , బ్రెజిల్ 5.1, టర్కీ 11.3 , యూకే 11.7 రేటుతో భారత్ కంటే ముందంజలో ఉన్నాయి.
మొదటిదశలో వాక్సినేషన్ ప్రక్రియ లక్షిత 400 మిలియన్ డోసులకుగాను కేవలం 16.5% నెమ్మదిగా మొదలైనా 2 వ దశలో 45 శాతంతో వేగం పుంజుకొంది.
వాక్సినేషన ఇదే తరహాలో కొనసాగితే జులై 31 నాటికి కేవలం 45 శాతం మందికి మాత్రమే వాక్సినేషన్ సదుపాయం అందుతుందని కేంద్రఆరోగ్యశాఖ ప్రకటనలో స్పష్టంచేసింది. రోజుకు 25.9 లక్షలడోసులు ప్రజలకు ఇస్తేనే నిర్దేశించిన లక్ష్యం సాధ్యపడుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డా.హర్షవర్ధన్ తెలిపారు.
వివిధారాష్ట్రాలలో కూడా ఆశించిన స్థాయిలో వాక్సినేషన్ కార్యక్రమం సాగడంలేదని సమాచారం. మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే బీహార్, పంజాబ్, తెలంగాణ, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో వాక్సినేషన్ తక్కువ స్థాయిలో జరుగుతున్నట్లు తెలుస్తోంది.
భారత్ సగటు రేటు కంటే ఎక్కువగా అరుణాచల్ ప్రదేశ్, దిల్లీ, గోవా, మిజోరాం, సిక్కిం, గుజరాత్, మణిపూర్, మహారాష్ట్ర , జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలలో వాక్సినేషన్ సాగుతోంది.
వాక్సినేషన్ ప్రక్రియ పట్ల సాధారణ ప్రజలలో ఉన్న కొద్దిపాటి సంశయాలకు ప్రభుత్వ యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు స్పందించి, నివృతి చేస్తే వాక్సినేషన్ ఆశించిన లక్ష్యాలు సాధించడం అసాధ్యమేం కాదు.
తొలిదశలో వాక్సినేషన్ వేయించుకున్న వారిలో కొందరు అస్వస్థతకు గురికావడం కొంతమేర ప్రజలలో గందరగోళానికి దారితీసింది.
క్రమంగా ప్రజలలో స్పృహ పెరిగింది. వాక్సినేషన్ కోసం స్వచ్చందంగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వాక్సినేషన్ తర్వాత కూడా మరికొంతకాలం వ్యక్తిగత రక్షణ విషయంలో అప్రమత్తంగా ఉండాలని , భౌతికదూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి సురక్షిత మార్గాలను మరచిపోవద్దని పెద్దఎత్తున ప్రచారం జరగాల్సి ఉంది. కరోనా నేర్పిన గుణపాఠం జీవితకాలం పాటిస్తే రాబోయే విపత్తులనుంచి గట్టెక్కే అవకాశం ఉందని మరువరాదు.
పొలమరశెట్టి కృష్ణారావు