తెలుగు రాష్ట్రాలు సిగ్గుపడాల్సిన విషయం ఇది. అన్నపూర్ణగా పేరు పొందిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో గణనీయమైన సంఖ్యలో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారు అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ దేశంలో నాలుగో స్థానంలో ఉండగా, తెలంగాణ ఆరో స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఇంత కన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఇక ఉంటుందా? తెలుగు రాష్ట్రాలు రాజకీయాలతో, కులాల గొడవలతో కుమ్ముకోవడం తప్ప అసలు సమస్యలపై ఏనాడైనా దృష్టి సారిస్తాయా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. పంట నష్టాలు, ఏటేటా పెట్టుబడులు పెరగడం, పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, అప్పులు, ఇలా కారణాలు ఏమైనా అన్నదాత బలవన్మరణాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. 2016 సంవత్సరంలో ప్రమాద మరణాలు-ఆత్మహత్యలకు సంబంధించి జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్సీఆర్బీ) తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 2016 గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా బలవన్మరణాలకు పాల్పడ్డ రైతులు, వ్యవసాయ కూలీలు సంఖ్య 11,379 గా నమోదు అయింది. అందులో ఏపీకి చెందిన వారు 7.06 శాతం కాగా తెలంగాణకు చెందిన వారు 5.66 శాతం మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణలో సొంత భూమి కలిగిన రైతులు, కౌలు రైతులు ఎక్కువ మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఏపీలో ఆత్మహత్యకు పాల్పడిన వారిలో 730 మంది పురుషులు, 74 మంది మహిళలు ఉండగా తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడిన పురుషుల సంఖ్య 572 కాగా మహిళా రైతుల సంఖ్య 73 మందిగా ఉంది. అదే విధంగా దేశవ్యాప్తంగా అత్యధికంగా ఆత్మహత్యలు జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఆరో స్థానంలో, ఆంధ్రప్రదేశ్ తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. 2016 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 1,31,008 మంది ఆత్మహత్య చేసుకోగా వారిలో 4.6 శాతం మంది ఏపీకి, 6.9 శాతం మంది తెలంగాణకు చెందినవారు ఉన్నారు. మృతుల్లో కూలీలు, గృహిణులే ఎక్కువగా ఉన్నారు. ఇదీ మన తెలుగు రాష్ట్రాలు సాధిస్తున్న గణనీయమైన ప్రగతి.
previous post