ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా అదుపు సహాయక చర్యలకు గాను నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నడుం కట్టారు. తన ఎంపీ నిధుల నుంచి కోటి రూపాయలను ప్రభుత్వానికి కేటాయించారు. తన సొంత నిధుల నుంచి 20 లక్షల రూపాయలను అందించారు.
విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి ద్వారా 20 లక్షల రూపాయల నిధులను జిల్లా కలెక్టర్ కు అందించాలని కోరారు. అందులో భాగంగా విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి బుధవారం 20 లక్షల రూపాయల సహాయనిధి చెక్కును జిల్లా మంత్రి అనిల్ కుమార్ యాదవ్, జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ భాస్కర్ భూషణ్ లకు నెల్లూరులో అందించారు.
ఈ కార్యక్రమంలో రూప్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ నిధులను కరోనా అదుపునకు వినియోగించాలని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కోరారు. కరోనాను నిరోధించే మాస్కులకు, సానీటైజర్లకు, ఇతరత్రా సహాయ చర్యలకు ఉపయోగించాలని తెలిపారు.
సామాజిక భద్రతకు భంగం గా పరిణమించిన కరోనా ను పారదోలడానికి ఈ నిధుల వినియోగం జరగాలన్నదే తమ అభిమతమని పేర్కొన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు భద్రత చేకూరాలని, ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలు ఇబ్బంది పడకుండా చూడాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
తద్వారా సామాజిక సంక్షేమం చేకూరాలన్నదే తన అభిమతమని తెలిపారు.