పదవ తరగతి పరీక్షా ఫలితాలలో రాష్ట్రంలో ములుగు జిల్లా ఐదవ స్థానంలో నిలిచిందని జిల్లా విద్యాశాఖ అధికారి జి.పాణిని తెలిపారు. ఈ ఫలితాల కోసం కష్టపడిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విషయ నిపుణులకు డిఇఓ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగా రెండు సంవత్సరాల అనంతరం నిర్వహించిన పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడం శుభ పరిణామం అని తెలిపారు.
జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో నేడు ప్రధానోపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటిడిఎ పివో అంకిత్ కార్యక్రమంలో పాల్గొని జిల్లా విద్యాశాఖ ను ప్రత్యేకంగా అభినందించారు. ములుగు జిల్లా వ్యాప్తంగా 3370 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 3239 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు.
మొత్తంగా 96.11% ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో ఐదవ స్థానంలో ములుగు జిల్లా నిలిచింది. ఇందులో బాలురు 1810 మంది విద్యార్థులు కాగా 1719 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. 1560 మంది బాలికలు కాగా 1520 మంది ఉత్తీర్ణులు అయ్యారు.
ఇందులో బాలికల ఉత్తీర్ణత శాతం 97.44% కాగా, బాలుర ఉత్తీర్ణత శాతం 94.97%గా ఉంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ని జిల్లా విద్యాశాఖ సన్మానించింది. అదనపు కలెక్టర్ రెవెన్యూ వై వి గణేష్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ సుదర్శన్ రెడ్డి, ఏ సి జి ఈ అప్పని జయదేవ్, ASC రాజు, ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అనంతుల సురేందర్, సామల శ్రీనివాసులు, కోశాధికారి రాజేష్, జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు, డీఈఓ కార్యాలయ సిబ్బంది ఉన్నారు.