వైసీపీ ఏడాది పాలనలో రాష్ట్రాన్ని కొంభకోణాలకు కేరాఫ్ అడ్రెస్సుగా మార్చారని నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి ఆరోపించారు. నేడు ఆయన కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖర్ల సమావేశంలో పాల్గొన్నారు.
రాష్ట్రం ఇసుక, మట్టి, మద్యం మాఫియాల మయం అయిందని ఆయన అన్నారు. చివరకు ప్రజల ప్రాణాలతో ముడిపడిన కరోనా టెస్టింగ్ కిట్లు, బ్లీచింగ్ పౌడర్ కొనుగోలులో కూడా అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు ప్రజల ప్రాణాలు కాపాడుతూ సేవలందిస్తున్న 108 అంబులెన్స్ ల కొనుగోలు, నిర్వహణ లో కూడా కుంభకోణానికి పాల్పడ్డారన్నారు.
ఈ విషయం పై ముఖ్యమంత్రి వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపి ఇందుకు బాధ్యులైన వారు ఎంత పెద్ద వారైనా వారిపై చర్యలు తీసుకొని తమ చిత్త శుద్దిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దారా విజయబాబు, ఇందుపురు మురళీకృష్ణ రెడ్డి, SK నాసీర్,మహమ్మద్,ఇంటూరు విజయ్, గరపాటి అనిల్, భదవరపు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.