నూతన జిల్లాల ఏర్పాటు పేరుతో భూముల రిజిస్ట్రేషన్ల ధరలు పెంచడం దుర్మార్గమని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు. నరసరావుపేట పట్టణం ఏనుగుల బజార్ నందు జరిగిన ప్రజా చైతన్య యాత్రలో పాల్గొని వార్డులోని ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు.
వార్డులోని పలువురు మహిళలు తమ అన్ని అర్హతలు ఉన్నా వృద్దాప్య, వితంతువుల పెన్షన్లు రావడం లేదని వాపోగా కొంతమంది తమ ఆధార్ కార్డుకు తమకు లేకపోయినా కార్లు, పొలాలు ఉన్నట్లు లింక్ చేసి పెన్షన్లు తొలగించారని తెలిపడంతో ఆయా పెన్షన్ల విషయాల పై సంబంధిత అధికారులతో డా౹౹చదలవాడ ఫోన్ ద్వారా మాట్లాడి సత్వరమే సమస్యపరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమం చేపట్టవలసి ఉంటుందని హెచ్చరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదలు ఒకటి లేదా రెండు సెంట్లు భూమికొనుక్కొని ఇల్లు నిర్మించుకోవాలనే కోరిక అందని ద్రాక్షలా మారిందని నూతన జిల్లాలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా తమ తమ నేతల జేబులు నింపేందుకు మాత్రమేనని పెంచిన భూముల రిజిస్ట్రేషన్ ధరల ద్వారా ప్రజలందరికీ అర్థమౌతుందని తక్షణమే పెంచిన భూముల రిజిస్ట్రేషన్ ధరలను తగ్గించకపోతే ఉద్యమిస్తామని డా౹౹చదలవాడ అరవింద బాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.