వకీల్ సాబ్, శ్యామ్ సింగరాయ్, భీమ్లానాయక్ చిత్రాలపై కొరడా ఝుళిపించిన అధికారులు ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా దర్శకుడు రాజమౌళి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన బృందంలో ఉన్న విషయం తెలిసిందే.
ఈ సినిమాకు రేట్లు పెంచుకోవడానికి జగన్ ప్రభుత్వం ప్రత్యేక జీవో కూడా జారీ చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమా వంద కోట్ల కన్నా ఎక్కువ పెట్టుబడి పెట్టిన చిత్రాల జాబితాలోకి రావడంతో టిక్కెట్ ధరలను అమాంతం పెంచేస్తూ జీవో ఇచ్చారు. టిక్కెట్ ధరలను ప్రభుత్వం పెంచినంత వసూలు చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు.
ప్రభుత్వ జీవో ప్రకారం రూ.75 ఉండాల్సిన టిక్కెట్ ధరను రూ.300 నుంచి రూ.400 వరకూ అమ్ముతున్నారు. పవన్ కల్యాణ్, నాని చిత్రాలకు కుంటి సాకులు చూపి ధియేటర్లు మూసేయించిన అధికారులు ఆర్ఆర్ఆర్ సినిమా సినిమా జోలికి మాత్రం వెళ్లడం లేదు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజవర్గం లోని (గిద్దలూరు, కంభం ,బెస్తవారిపేట) థియేటర్ యాజమాన్యాలు ప్రభుత్వ జీవో -13 నిబంధనలకు విరుద్ధంగా అదనంగా 300 నుండి 500 వసూలు చేస్తున్నారంటూ అభిమానుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లోని నాన్ ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.20, ప్రీమియం టికెట్ ధర రూ.40గా ఉంటుంది.
ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.50, ప్రీమియం టికెట్ ధర రూ.70గా ఉంటుంది. స్పెషల్ థియేటర్లలో నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.70, ప్రీమియం టికెట్ ధర రూ.90 ఉంటుంది. మల్టీప్లెక్సుల్లో రెగ్యులర్ సీట్లకు రూ.100, రిక్లైన్ సీట్లకు రూ.250గా నిర్ణయించారు. ఈ నిబంధనలన్నీ తుంగలో తొక్కుతున్నా అధికారులు మాత్రం మౌనవ్రతం పాటిస్తున్నారు.