కామారెడ్డిలో 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సాదాసీదాగా సాగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకలు చేయకపోవడంతో ఎక్కడికక్కడ నామమాత్రంగా వేడుకలు జరిపి చేతులు దులుపుకున్నారు. శకటాలు లేవు. సాంస్కృతిక కార్యక్రమాలు లేవు. పరేడ్ లేదు. ప్రశంసా పత్రాల ఊసే లేదు. వేడుకలు జరిపామా లేదా అన్నట్టు ఈసారి వేడుకలు జరిపారు.
బోసిపోయిన ఇందిరాగాంధీ స్టేడియం
ప్రతి సంవత్సరం అధికారిక కార్యక్రమాలు ఏవైనా ఇందిరాగాంధీ స్టేడియంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పంద్రాగస్టు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, గణతంత్ర దినోత్సవ వేడుకలను అధికారులు నిర్వహిస్తూ ఉంటారు. ఈ సారి గతానికి భిన్నంగా వేడుకలకు స్టేడియం దూరమైంది. ఎప్పటిలాగే స్టేడియంలో వేడుకలు జరుగుతాయని భావించిన ప్రజలు అధిక సంఖ్యలో స్టేడియం వద్దకు చేరుకుని వెనుదిరిగారు. అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. దాంతో స్టేడియం జనాలు లేక వెలవెలబోయింది
క్యాంప్ కార్యాలయంలో ఎగరని జెండా
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ సారి జాతీయ జెండా ఎగురలేదు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో క్యాంపు కార్యాలయంలో జెండా ఎగురవేసే వారే కరువయ్యారు. పార్టీ నాయకులు ఎమ్మెల్యే ఇంటివద్ద జెండా ఆవిష్కరించారు. దాంతో క్యాంపు కార్యాలయం నిర్మానుష్యంగా మారింది.
కలెక్టరేట్ లో నామమాత్రంగా
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నామమాత్రంగా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన కలెక్టర్ జితేశ్ వి పాటిల్ జాతీయ జెండాను ఆవిష్కరించి కేవలం 10 నిమిషాల్లో కార్యక్రమం ముగించుకుని క్యాంప్ కార్యాలయంలో ఎట్ హోమ్ కార్యక్రమానికి వెళ్లిపోయారు. జిల్లా ప్రగతిపై ప్రసంగం లేదు. ప్రతిసారి ఉత్తమ ఉద్యోగులను ఎంపిక చేసి వారికి ప్రశంసా పత్రాలు ఇవ్వడం ఆనవాయితీ. ఈసారి ఆ అనవాయితికి తిలోధికాలిచ్చారు. ఒక్క అధికారికి కూడా ప్రశంస పత్రాలు అందజేయలేదు. అసలు కలెక్టర్ కార్యాలయంలో అసలు వేడుకల నిర్వహణ లేదనే చెప్పాలి. దాంతో అధికారులు సైతం నివ్వెరపోవాల్సిన పరిస్థితి నెలకొంది.