కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న విపత్కర పరిస్థితులలో వినాయక నవరాత్రుల కోసం మండపాల ఏర్పాటును అనుమతించడం లేదని ములుగు ఏ ఎస్ పి పి. సాయి చైతన్య తెలిపారు.
ఈ నెలలో వినాయక చవితి పర్వదినోత్సవం క్రమంలో జిల్లాలో గణేష్ నవరాత్రులు నిర్వహించడానికి మండపాల నిర్వాహకులు సన్నద్ధమవుతున్న క్రమంలో ప్రస్తుత విపత్కర పరిస్థితులు, కరోనా వ్యాప్తి నియంత్రణ విషయంలో అన్ని స్థాయిలలో ప్రజలకు అవగాహన కల్పించేలా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు.
కరోనా కేసులు ఉధృతమవుతున్న నేపధ్యంలో మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజలు పోలీస్ శాఖతో కరోనా వ్యాప్తి నియంత్రణకు సహకరించాలని కోరారు. భక్తి శ్రద్ధలతో వినాయక నవరాత్రులను ఈ ఏడాది ప్రజలంతా తమ తమ ఇండ్లలోనే నిర్వహించుకోవాలని ఆయన సూచించారు.
విగ్రహాల తయారీదారులు కోవిడ్ కేసులు, విపత్కర పరిస్థితుల క్రమంలో వినాయక విగ్రహాలను తయారు చేసి ఇబ్బందులు పడవద్దన్నారు. ఎట్టి పరిస్థితులలో నవరాత్రుల నిర్వహణకు పోలీస్ శాఖ నుండి అనుమతులు ఇచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు.
కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితులలో ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉంటూ కరోనా వ్యాప్తి నియంత్రణకు తమతో సహకరించాలని ఎఎస్పీ పి. సాయి చైతన్య కోరారు.