‘‘సమాజమే దేవాలయం… పేద ప్రజలే దేవుళ్లు’’ అనే సిద్ధాంతాన్ని అమలు చేసిన చూపిన ధీరోదాత్తుడు, పాలనను ప్రజల వద్దకు తీసుకువెళ్లిన నిజమైన ప్రజానాయకుడు అయిన ఎన్టీఆర్ సిద్ధాంతాలను భావితరాలకు అందించేందుకు తెలుగుదేశం పార్టీ (తెలంగాణ) ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన నడుంకట్టారు.
ఈ మేరకు NTR SCHOOL OF THOUGHT [NTRISM] స్వచ్ఛంద సంస్థ ను ఆమె ప్రారంభిస్తున్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని గుర్తించని ఆనాటి పాలకులకు వ్యతిరేకంగా అతి తక్కువ సమయంలోనే ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని ఈ సందర్భంగా కాట్రగడ్డ ప్రసూన అన్నారు.
సమైక్య ఆంధ్రప్రదేశ్ స్థాయిలో జరిగిన ఈ ప్రయోగం సఫలం కావడంతో దేశంలోని మహామహులైన నాయకులు ఎన్టీఆర్ సిద్ధాంతాలను జాతీయ స్థాయిలో అమలు చేశారని ఆమె తెలిపారు. ఫలితంగానే నేషనల్ ఫ్రంట్ ఏర్పడి దేశ రాజకీయాలను మేలిమలుపు తిప్పిందని ఆమె తెలిపారు.
ఎన్టీఆర్ పాలనలోని సునిశిత అంశాలను విశ్లేషిస్తూ మరింత పరిశోధన జరగాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కాట్రగడ్డ ప్రసూన తెలిపారు.
ఆనాటి రాజకీయ, ఆర్ధిక పరిస్థితులు ఆయన తీసుకున్న నిర్ణయాలను వివరణాత్మకంగా భావితరాలకు అందించాలన్న సత్ సంకల్పంతో NTR SCHOOL OF THOUGHT [NTRISM] ను ప్రారంభిస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఆనాడు ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల పేర్లు మార్చారు తప్ప మూల సిద్ధాంతాన్ని ఇప్పటి వరకూ ఏ నాయకుడు మార్చలేకపోయారని ఆమె అన్నారు.
ఈ నాటి పాలకులు పేరు ఏది పెట్టినా ఆనాటి కిలో రెండు రూపాయల బియ్యం పథకం, పక్కా ఇళ్లు, ఆడపడుచులకు ఆస్తి హక్కు, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు లాంటి విప్లవాత్మక కార్యక్రమాలు ఈనాటికీ కొనసాగుతున్నాయని కాట్రగడ్డ ప్రసూన అన్నారు.
ఎమ్మెల్యేలు, ఎంపిలు ఏసి గదులు దాటి బయటకు రాని సంస్కృతిని మార్చి ప్రజల గడప వద్దకు వారు వెళ్లేలా చేసిన నిజమైన ప్రజానాయకుడు ఎన్టీఆర్ అని ఆమె తెలిపారు. పాలనలో ఆయన తీసుకున్న ఆదర్శ నిర్ణయాలను భావితరాలకు అందచేయడమే తన జీవిత లక్ష్యమని కాట్రగడ్డ ప్రసూన తెలిపారు.
రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఉన్నందున ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు.