విజయనగరం లో రాష్ట్ర బాలల హక్కుల చైర్మన్ పర్యటన: కలెక్టరేట్ లో బాలల హక్కుల దినోత్సవం
పిల్లలపై కన్నవారి దృష్టి నిరంతరం ఉండాలి రాష్ట్ర బాలల హక్కుల చైర్మన్ కేసలి అప్పారావు అన్నారు. అలాగే బాలల హక్కుల గురించి బాలలకు, సమాజానికి తెలియజేయవలసిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. బాలలు తమ బాల్యాన్ని అనుభవిస్తూనే నచ్చిన రంగం లో ఎదిగాలని పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ఆడిటోరియం లో ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, మరియు ఐ.సీ.డీ.ఎస్, బెజ్జిపురం యూత్ క్లబ్ , కైలాష్ సత్యర్ది చిల్డ్రన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలల హక్కుల వారోత్సవం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడ పిల్లల చదువు తల్లి దండ్రులకు ఆటంకం కాకూడదనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఉన్నత విద్య వరకు డి.బి.టి పధకం ద్వారా నగదు చెల్లించే అనేక పధకాలను అమలుచేస్తోందని తెలిపారు. అంగన్వాడీ నుండి హై స్కూల్ వరకు పాఠశాలలలో పౌష్టికాహారాన్ని అందిస్తూ ఆరోగ్యకరమైన వాతావరణం లో పిల్లలకు చదువు అందించడం జరుగుతోందన్నారు. ప్రభుత్వం అనేక పధకాలను అమలు చేస్తున్నందున కనీసం 18 ఏళ్ళు నిండే వరకు బాలికలను ప్రతి తల్లి దండ్రులు చదివించాలని, పెళ్లి చేయరాదని కోరారు.
బాల్య వివాహాలను జరిపే తల్లి దండ్రుల పైన, వివాహానికి ఏర్పాట్లు చేసేవారి పైన, పురోహితులు ఆఖరికి బాల్య వివాహాలకు హాజరయ్యే అతిధుల పైన కూడా కేసు బుక్ చేయాలని , బాల్య వివాహాల పట్ల కఠిన వైఖరి ప్రదర్శించాలని తెలిపారు. సమాజ పరంగా, శాఖా పరంగా కూడా పూర్తిగా బాల్య వివాహాలను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. బాల్య వివాహాల వలన ఎర్లీ ప్రేగ్నన్సి లతో కాన్పు లోనే బిడ్డలు, తల్లులు మరణిస్తున్న పరిస్థితులు ఉన్నాయని, ఈ విషయాలను ప్రతి తల్లి దండ్రి తెలుసుకునేలా మహిళా పోలీస్, అంగన్వాడీ కార్యకర్తలు అవగాహన కలిగించాలన్నారు. బాలలకు స్వేచ్చగా చదువుకొని, వారికీ నచ్చే రంగం లో ఎదగడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.
ఎ.పి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు మాట్లాడుతూ బాలల హక్కుల ఉల్లంఘన జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. టీనేజేర్లు చెడు స్నేహాలు చేయ వద్దని, సెల్ ఫోన్లకు , సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని , అనుకున్న లక్ష్యాలను చేరే వరకు కళ్ళ ముందు లక్ష్యమే కనపడాలని హితవు పలికారు. బాల్య వివాహాల నిరోధం పై కీలక బాధ్యత మహిళా పోలీస్ లకు ఉందని, నిరంతరం వీరు పర్యవేక్షణ గావించాలని అన్నారు. యుక్త వయసు ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు.
మహిళా హక్కుల కమిటీ ఛైర్పర్సన్ హిమ బిందు మాట్లాడుతూ ఆడ పిల్లల పై అనవసర ఆంక్షలు ఉండకూడదని, ఇవి వారి మానసిక ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తాయని అన్నారు. అమ్మాయిల్ని, అబ్బాయిల్ని సమానంగా చూడాలని , తలి దండ్రులు ఉండి కూడా అనాధలుగా పిల్లల్ని చేయకూడదని తెలిపారు. జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు అనేక చర్యలు చేపట్టడం వలన తగ్గుముఖం పడుతున్నాయని అన్నారు.
బెజ్జిపురం యూత్ క్లబ్, ఐ.సి.డి.ఎస్ ల ద్వారా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికీ బహుమతులను , మెమెంటో లను అందజేశారు. జాతీయ స్థాయి లో స్కేటింగ్ లో మొదటి బహుమతి సాధించిన బొల్లెంకుల లోహిత్ రెడ్డి, తైక్వాండో లో ఆసియ బుక్ అఫ్ రికార్డుస్ సాధించిన ఇషిత , నేషనల్ సూపర్ కిడ్ గా అవార్డు పొందిన్ ముచ్చి రేయప్ప నితీష్, శ్రేష్ఠ బాలిక గా అవార్డు పొందిన దివ్యాంగురాలు శ్రేయ మిశ్ర , యునిసెఫ్ అంబాసిడర్ , సఖి గ్రూప్ కార్యకర్త పెదమజ్జి సౌభాగ్య, యు.ఎన్.ఓ లో ఎ.పి ఎడ్యుకేషన్ పై ప్రసంగించిన అల్లం రిశిత రెడ్డి, నేషనల్ కామన్ వెల్త్ లో గోల్డ్ మెడల్ సాధించిన బెల్లాన హారిక లను ఘనంగా సత్కరించి, మెడల్స్ అందజేశారు.
కార్యక్రమం లో ఐ.సి.డి.ఎస్ పి.డి శాంత కుమారి, సి.డి.పి.ఓ లు, బెజ్జిపురం యూత్ క్లబ్ ప్రోగ్రాం డైరెక్టర్ ప్రసాద రావు,పలు పాఠశాలల విద్యార్ధులు పాల్గొన్నారు.