ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ఈనెల 22 న జరిగే ఎన్నికలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఎన్నికల నిర్వహణకు నోడల్ అధికారులతో పాటు ఆర్వోలు, ఏఆర్వో లను ఇప్పటికే నియమించి, వీరికి రెండు పర్యాయాలు శిక్షణ కూడా ఇచ్చారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ వాహనాల తనిఖీ చేపడుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. సోమవారం వరకే గడువు ఉండడంతో వార్డుల్లో ప్రచారం ముమ్మరమైనది.
టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం గల్లి గల్లి తిరుగుతూ తమకు ఒకసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తమ గుర్తుకే ఓటు వేయండి అంటూ రికార్డింగ్ ఆడియో లతో వీధుల్లో మైకులతో మోత మోగిస్తున్నారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 12 వార్డుల్లో మొత్తం11,993 ఓట్లు ఉండగా, అందులో 5,782 పురుషులు, 6,211 మహిళల ఓట్లు ఉన్నాయి. ఇచ్చట మహిళా ఓటర్లు కీలకంగా మారనున్నారు. దీనికి అనుగుణంగా అధికారగణం 26 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల అనంతరం ఎల్లారెడ్డి లోని మోడల్ డిగ్రీ కళాశాలలో బ్యాలెట్ బాక్సులను భద్రపరచడంతో పాటు, అక్కడే కౌంటింగ్ నిర్వహించనున్నారు.