తిరుపతి లోక్ సభ స్థానంలో గెలుపు బాధ్యతను తీసుకోవాలని కేంద్ర మంత్రి అమిత్ షా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కోరారు.
నేడు ఢిల్లీలో అమిత్ షాతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో జనసేన ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.
తిరుపతి లోక్ సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, గెలుపే లక్ష్యంగా పని చేయాలని అమిత్ షా కోరారు. గెలుపు బాధ్యతను పవన్ కల్యాణ్ కే అప్పగిస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు.
సామాజిక వర్గాల సమీకరణాలను ప్రభావితం చేయడం ద్వారా గెలుపు సొంతం చేసుకోవాలని అందుకు పవన్ కల్యాణ్ చురుకైన పాత్ర తీసుకోవాలని అమిత్ షా కోరారు.
అమిత్ షా చేసిన పలు సూచనలను పవన్ కల్యాణ్ అంగీకరించినట్లు తెలిసింది.
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్ధినే నిలబెడుతున్నాం అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఏక పక్షంగా ప్రకటించడంతో జనసేన నాయకులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.
కొద్ది రోజుల పాటు వారు అలకబూనడంతో బిజెపి దిగి వచ్చి వారితో చర్చలు జరిపింది.
రెండు పార్టీలకు ఆమోదయోగ్యుడైన అభ్యర్ధినే బరిలో దించుతామని, తాము ఏక పక్ష నిర్ణయం తీసుకోమని సోము వీర్రాజు తో బాటు ఢిల్లీ పెద్దలు అనునయించడంతో పవన్ కల్యాణ్ మెత్తబడ్డారు.
అయితే జనసేన పార్టీ మనస్ఫూర్తిగా సహకరిస్తుందా లేదా అనే సంశయం బిజెపి నాయకులకు రావడంతో వారు ఢిల్లి పెద్దల ఎదుట తమ అనుమానాలు ఉంచినట్లు తెలిసింది.
అనుమానాల నివృత్తిలో భాగంగా అమిత్ షా పవన్ కల్యాణ్ తో సమావేశం అయినట్లు తెలిసింది. గెలుపు బాధ్యతను అమిత్ షా పవన్ కల్యాణ్ కే అప్పగించారు.