తిరుమలలో మండపాల పునర్నిర్మాణాలపైనా, మరమ్మత్తులపైనా తక్షణ చర్యలు తీసుకోవాలని, తక్షణమే పురాతన కట్టడాలను కాపాడాలని ప్రధాని నరేంద్రమోదీకి రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ శ్రీవారి దర్శనార్థం 26న తిరుమలకు వస్తున్న సందర్భంగా ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా,పీఠాధిపతుల, మఠాధిపతుల పర్యవేక్షణలో వారి సూచనలను తీసుకొని పనులు చేసేలా టీటీడీ అధికారులకు స్పష్టమైన కఠినమైన ఆదేశాలు ఆయన కోరారు.
తిరుమలలో పునర్నిర్మానం చేసిన పార్వేటి మండపాన్ని ప్రధాని ప్రత్యక్షంగా పర్యవేక్షించి గతంలో ఉన్న పురాతన మండపానికి, ప్రస్తుతం మరమ్మత్తుల పేరుతో పునర్నిర్మాణం చేపట్టిన మండపానికి గల వ్యత్యాసం పై కోట్లాదిమంది శ్రీవారి భక్తులలో ఉన్న అపోహలను తొలగించేలా బహిరంగ ప్రకటన చేయాలన్నారు. తిరుమలలోని పార్వేటి మండపం, అలిపిరి పాదాల మండపం వద్ద గల పురాతన సంపదను జీర్ణోద్ధరణ, మరమ్మతుల పేరుతో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సూచనలను సలహాలను పరిగణలోకి తీసుకోకుండా టిటిడి ఉన్నతాధికారులు పనులు పూర్తి చేస్తున్నారని శ్రీవారి భక్తునిగా దేశ ప్రధాని కార్యాలయానికి మెయిల్స్, లేఖల ద్వారా పంపించడం వారి కార్యాలయానికి చేరినట్లు సమాచారం రావడం శుభ పరిణామం అన్నారు.
తిరుమలలోని పురాతన సంపదను కాపాడాలని భవిష్యత్ తరాల వారికి అందించాలని మరమ్మత్తులు చేయాలంటే కచ్చితంగా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వారి సూచనలను పరిగణలోకి తీసుకోవాలని శ్రీవారి భక్తులుగా స్థానికులుగా విజ్ఞప్తులు చేస్తే ASI పరిధిలో తిరుమలలోని పురాతన మండపాలు లేవని వారి అనుమతులు అవసరం లేదని బహిరంగ ప్రకటన చేసిన టీటీడీ ఉన్నతాధికారులు నేడు పురాతన మండపాల సందర్శనకు రావాలని తగు సూచనలు ఇవ్వాలని(ASI) ఏఎస్ఐ వారికి లేఖలు రాయడం దైవానుగ్రహం అన్నారు.
తిరుమలలోని పురాతన మండపాలను తొలగించే సమయంలో ఏ ఒక్క మఠాధిపతులను ఆహ్వానించని టిటిడి అధికారులు మరమ్మత్తుల పేరుతో పునర్నిర్మానం చేసిన తర్వాత ప్రతిరోజు ఒక మఠాధిపతి తిరుమలకు రావడం పార్వేటి మండపాన్ని సందర్శించడం భక్తులకు సౌకర్యంగా నిర్మించారని టీటీడీ అధికారులను అభినందిస్తూ లేఖ విడుదల చేయడాన్ని తిరుమల వెంకన్నస్వామి తో సహా శ్రీవారి భక్తులంతా గమనిస్తున్నారన్నారు.
తిరుమలలోని పురాతన మండపాల పునర్నిర్మాణ,మరమ్మత్తుల సందర్భంగా మఠాధిపతులను పీఠాధిపతులను పిలిపించి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారుల సమక్షంలో వారి సూచనలు సలహాలను తీసుకొని మరమ్మత్తు పనులు చేపట్టి ఉంటే భక్తులంతా స్వాగతించే వారన్నారు. తిరుమల శ్రీవారి కోట్లాదిమంది భక్తుల సూచనలను రాజకీయ కోణంలో చూడటం టిటిడి అధికారులు మానుకోవాలన్నారు.
తిరుమల శ్రీవారికి సేవకులుగా భక్తులు ఇచ్చే సూచనలను పరిగణలోకి తీసుకొని సంబంధిత అధికారులతో మఠాధిపతులతో టీటీడీ అధికారులు చర్చించి చేపట్టే ఏ పనికైనా దేవదేవుని అనుగ్రహం ఉంటుందన్నారు అలా కాకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే పనులకు శ్రీవారు కచ్చితంగా చెక్ పెడతారన్నారు.