ఆర్టికల్ 370ని రద్దు చేసినపుడు కాశ్మీర్ ఎలా ఉందో ప్రత్యక్షంగా చూడలేదు కానీ ఇప్పుడు అమరావతి గ్రామాలలో ఆ లోటు తీరుతున్నది. కృష్ణా, గుంటూరు జిల్లాలో 7200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం నుండి సచివాలయం వరకు అడుగడుగునా పోలీసులు పహారా కాస్తున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో పోలీస్ పహారా ఏర్పాటు చేయడంతో ఇక్కడ యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. రోడ్లపై ఎక్కడ చూసినా ఫెన్సింగ్ తీగలు వేసేశారు. ముళ్ల కంచెలు, పోలీసు బందోబస్తు చూసి స్థానికులు బెంబేలెత్తుతున్నారు.
151 స్థానాలతో గెలిచిన వైసిపి ఎలాంటి గొడవలు లేకుండా పరిపాలన సాగించాల్సిన తరుణంలో ఏడు నెలల్లోనే ఇంతటి భీతావహ పరిస్థితిని తెచ్చుకోవడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కాన్వాయ్ పై ఎవరు రాళ్లు రువ్వకుండా వలలు ఏర్పాటు చేసుకోవడం నుంచి రకరకాల చర్యలు తీసుకుంటూ పోలీసులు భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 151 స్థానాలు గెలిచిన ముఖ్యమంత్రి ఏడు నెలల్లో ఈ పరిస్థితికి రావడం కూడా ఆశ్చర్యం కలిగిస్తున్నది.