మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్ట్ నుంచి నిన్న అర్ధరాత్రి బలవంతపు డిశ్చార్జి హైడ్రామా వరకు ప్రభుత్వ కక్షసాధింపు స్పష్టంగా కనిపిస్తోందని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవిందబాబు అన్నారు. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అర్ధరాత్రి బలవంతంగా డిశ్చార్జి చేయడానికి ప్రయత్నించడం తీవ్రమైన విషయమని ఆయన అన్నారు.
3 రోజులు ఆస్పత్రి బెడ్ పైనే విచారణకు అనుమతి ఇచ్చిన కోర్టును కూడా ధిక్కరిస్తారా? అర్ధరాత్రి డిశ్చార్జి చేయాలని డాక్టర్లపై పోలీసులు ఒత్తిడి తేవడం దుర్మార్గం. ఒకటికి రెండు సార్లు శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న వ్యక్తితో ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. అరెస్ట్ రోజు 14 గంటల పాటు కారులో తిప్పడం నుంచి ఇప్పటి వరకు అచ్చెన్న విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని డాక్టర్ అరవిందబాబు అన్నారు.
ఈ రాష్ట్రంలో సామాన్యుల నుంచి సీనియర్ ప్రజాప్రతినిధుల వరకు అందరి విషయంలో హక్కుల ఉల్లంఘన జరుగుతుండటం దురదృష్టకరమని ఆయన అన్నారు. అమరావతిలో ప్రజా రాజధానిని జగన్ కూల్చి ఏడాది అవుతుంది. నేడు కూల్చి వేసిన ప్రజావేదికను సందర్శించడానికి వెళ్తున్న తెదేపా నాయకులు వర్ల రామయ్య, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు, తెనాలి శ్రావణ్ కుమార్, అశోక్ బాబు, బచ్చుల అర్జునుడు, పిల్లి మాణిక్యరావు తదితర నాయకులు అరెస్ట్ చేయడం దారుణం.
ప్రశ్నించిన ప్రతిపక్షాల పైన సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ అరెస్టులు వేధింపులు నిత్యకృత్యమయ్యాయని ఆయన అన్నారు.