విజయనగరం కార్పొరేషన్లోని 5వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మృతి చెందిన ఆ డివిజన్ పోలింగ్ ప్రక్రియ 12 వ తేదీన బాబామెట్ట బాలికోన్నత పాఠశాలలో జరిగింది. పోలింగ్ ను జిల్లా కలెక్టర్ డా.హరి జవహర్ లాల్ పరిశీలించారు. పాఠవాలలో ఉన్న ఐదు పోలింగ్ బూత్లను సందర్శించి, ప్రిసైడింగ్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఓటర్లతో మాట్లాడి, వారి సమస్యలపై ఆరా తీశారు. ఓటర్లకు ఎండవల్ల ఇబ్బంది కలగకుండా క్యూలైన్లను మార్పు చేయించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జారీ చేసిన ప్రత్యేక ఆదేశాలకు అనుగుణంగా 5 డివిజన్లో ఎన్నిక నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎప్పటిలాగే ఇక్కడ కూడా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోందన్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు గాను, ఇప్పటికే ఓటర్లకు ఓటర్ స్లిప్పులను పంపిణీ చేయడం జరిగిందన్నారు.
14 న ఓట్ల లెక్కింపు..పకడ్బందీగా ఏర్పాట్లు
ఈ నెల 14 వ తేదీన ఓట్లు లెక్కింపు ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా.హరి జవహర్ లాల్ తెలిపారు. నెల్లిమర్ల మినహా, మిగిలిన నాలుగు మున్సిపాల్టీలకు నలుగురు ఐఏఎస్ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించామన్నారు. వీరంతా కౌంటింగ్ను స్వయంగా పర్యవేక్షిస్తారని కలెక్టర్ తెలిపారు.
ఇక కౌంటింగ్ సిబ్బందికి రెండో విడత శిక్షణా కార్యక్రమాన్ని ఈ నెల 13 నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆయా మున్సిపాల్టీల కౌంటింగ్ సెంటర్లలోనే శిక్షణ ఏర్పాటు చేశామని, కౌంటింగ్ నమూనా కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికలకు సహకరించినట్లుగా, కౌంటింగ్ను కూడా ప్రశాంతంగా పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీలు తమ సంపూర్ణ సహకారాన్ని అందించాలని కలెక్టర్ ఈ సందర్బంగా కోరారు.
కలెక్టర్ తో పాటు మున్సిపల్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ, తాహశీల్దార్ ఎం.ప్రభాకరరావు, ఇతర ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.