నాలుగున్నర దశాబ్దాలకు పైగా అంధుల పాఠశాలను నడిపిన పోరెడ్డి రోసమ్మ సంకల్పం గొప్పదని విజయ డైరీ ఛైర్మన్ రంగారెడ్డి కొనియాడారు. విశ్వ భారతి అంధుల పాఠశాల వ్యవస్థాపకురాలు పోరెడ్డి రోసమ్మ శిలావిగ్రహాన్ని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తరఫున రంగారెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు.
ఆయన మాట్లాడుతూ విశ్వ భారతి అంధుల పాఠశాల నిర్వాహకుడు పెంచల్ రెడ్డి, ప్రభావతమ్మ, రోశమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించాలని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని కోరారని తెలిపారు. ఆయన అందుబాటులో లేని కారణంగా తనను ఈ కార్యక్రమంలో భాగస్వామిని చేశారని పేర్కొన్నారు.
రోసమ్మ ఇన్నేళ్లుగా వందలాది మంది అందులకు విద్యా బోధన కోసం తపించారని, అందుకు ఇక్కడి సిబ్బంది ఎంతో సహకరించారని ప్రశంసించారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ బృహత్తర కార్యక్రమంలో మొదటినుంచి పాల్గొంటూ ఇక్కడ ఎన్నో సౌకర్యాలను సమకూర్చారని మెచ్చుకున్నారు.
మరెన్నో కార్యక్రమాలు ఆయన చేయ సంకల్పించారని తెలిపారు. వాటిని ఆయన తప్పక నెరవేరుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల అధ్యక్షుడు పెంచల్ రెడ్డి మాట్లాడుతూ 1974లో ఐదుగురు అంధ విద్యార్థులతో ఈ పాఠశాల ప్రారంభమైందని గుర్తు చేశారు. ఇక్కడ విద్య నేర్చిన కొన్ని వందల మంది విద్యార్థులు ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, సిబ్బంది నిర్వాహకులు పాల్గొన్నారు.