భూ సంబంధిత సమస్యలను త్వరగతిన పరిష్కరించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ ప్రజావాణి హాలులో జిల్లాలోని మారుమూల గ్రామాలనుండి వచ్చిన సమస్యల అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సమస్యను తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా భూసంబంధిత, రెవెన్యూ , దివ్యంగుల పింఛన్లు, వైద్యసేవలు తదితర 46పిర్యాదులు వచ్చాయని తెలిపారు.
సంబంధిత శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా భూగర్భ జల శాఖ ఆధ్వర్యంలో వర్షపు నీటిని ఒడిసి పట్టి ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఇంచార్జి జిల్లా రెవెన్యూ అధికారి రాథోడ్ రమేష్, జిల్లా అధికారులు సుధీర్, అంజిప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, కిరణ్ కుమార్, శరత్ కుమార్, ధన్ రాజ్, శ్రీనివాస బాబు, తహసీల్దార్ లు సుభాష్ చందర్, జాకిర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.